Pages

3, ఆగస్టు 2026, సోమవారం

ఉచిత ఆర్చరీ శిక్షణ @దోమకొండ

 ఆర్చరీ క్రీడల్లో జోరుగా పతకాలు సాధిస్తున్న క్రీడాకారులు... 

దోమకొండ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తూ కఠోర సాధన తో విజయాలు సాధిస్తున్నారు .వరుస విజయాలతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కఠోర సాధన, లక్ష్యంపై అచంచలమైన ఏకాగ్రతతో దోమకొండ ప్రాంతానికి చెందిన యువ ఆర్చర్లు జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభను ప్రదర్శిస్తూ పతకాలు సాధిస్తున్నారు .ఆర్చరీ ఆటకు దోమకొండ కేరాఫ్ అడ్రస్ గా మారింది. 

దోమకొండ గడికోట మైదానంలో సంస్థాన వారసులైన కామినేని అనిల్ కుమార్ 2007లో ఆర్చరీ అకాడమీ ఏర్పాటుచేసి విలువిద్యకు సంబంధించిన మెలకువలను అభ్యర్థులకు ఉచితంగా అందిస్తున్నారు. ఇక్కడి ఉచిత శిక్షణతో విలువిద్య క్రీడలో దోమకొండ విద్యార్థులు రాణిస్తున్నారు .పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆర్చరీ శిక్షకుడు ప్రతాప్ దాస్ శిక్షణలో మెలకువలు నేర్చుకొని రాష్ట్ర ,జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ పతకాలు సాధిస్తున్నారు. 

ఒకవైపు చదువుతూనే నిత్యం 4 గంటల సాధన చేస్తున్నారు. 19 ఏళ్లుగా ఇక్కడ ఎంతో మంది ఆర్చరీ లో రాణించి తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చారు. దోమకొండ తో పాటు బిక్నూర్ ,బీబీపేట ,మాచారెడ్డి మండలాలకు చెందిన పలు గ్రామాల విద్యార్థులతో పాటు కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు సైతం ఇక్కడికి వచ్చి విలువిద్య నేర్చుకుంటున్నారు. 

2007లో ఇక్కడ 40 మంది విద్యార్థులతో మొదలైన ఆర్చరీ శిక్షణ ప్రస్తుతం 550 మందికి చేరిందని ఆర్చరీ కోచ్ ప్రతాప్ దాస్ గారు తెలిపారు. కామినేని అనిల్ కుమార్ గారు ఉచితంగా సొంత డబ్బులతో ఆర్చరీ మెటీరియల్  అందించి వారికి పూర్తి శిక్షణ ఇప్పిస్తున్నారు. దోమకొండ, కాచాపూర్, పెద్ద మల్లారెడ్డి, బిబిపేట, ఫరీద్ పేట, పాల్వంచ, భిక్కనూరు, రామేశ్వర పల్లి, జంగంపల్లి, కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు విద్యార్థులు కొన్నేళ్లుగా ఇక్కడికి ఆర్చరీ శిక్షణ కోసం వస్తున్నారు. దీనితో ఆర్చరీ ఆట  అంటేనే దోమకొండ అనే విధంగా తయారయింది. 

దోమకొండకు చెందిన కదిరె సింధుజ పదేళ్ల నుంచి ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ ఇప్పటివరకు 38 సార్లు జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలలో పాల్గొన్నది. జాతీయస్థాయిలో రెండు సిల్వర్, రాష్ట్రస్థాయిలో ఓవరాల్ గా 44 బంగారు, ఐదు సిల్వర్ పతకాలు సాధించింది. ఒలింపిక్ పతకం సాధించడమే లక్ష్యంగా కఠోర సాధన చేస్తోంది.

భిక్కనూరుకు చెందిన నిరుపేద కూలి కుటుంబానికి చెందిన అనుదీప్ 8 ఏళ్లుగా ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ జైపూర్లో నిర్వహించిన జాతీయ  పోటీలలో సిల్వర్ మెడల్ సాధించాడు.

19 ఏళ్లుగా కోచ్ గా ప్రతాప్ దాసు గారు.. 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రతాప్ దాస్ గారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడారు. మొదట విజయవాడలో కోచ్ గా చేరారు. అనంతరం తనతో పాటు ఆర్చరీ ఆటలో పాల్గొన్న దోమకొండ గడికోట వారసులు కామినేని అనిల్ కుమార్ దోమకొండకు తీసుకు రావడంతో 19 ఏళ్లుగా ఇక్కడి విద్యార్థులకు కోచ్ గా ఉంటూ జాతీయ స్థాయిలో విద్యార్థులు పతకాలు సాధించేలా తీర్చిదిద్దారు. 

విలువిద్య శిక్షకుడు.. ప్రతాప్ దాస్..97051 41241

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి