28, ఆగస్టు 2026, శుక్రవారం

ఉచిత డిజిటల్ కంటెంట్@టీ - శాట్

 విద్య అనేది ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు ఒక కుటుంబం భవిష్యత్తును, సమాజం యొక్క అభివృద్ధిని మార్చ గలిగే శక్తి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తే వారి జీవితాలలో ఒక మంచి మార్పు అనేది వస్తుంది. ఈ ఆలోచనతోనే తెలంగాణలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి విద్యాసంస్థలలో మౌలిక వసతులు మెరుగు పరచడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంచేందుకు వినూత్నమైన చర్యలు చేపడుతుంది. ఈ ప్రయత్నాలకు సాంకేతికని జోడిస్తూ టీ శాట్ చేస్తున్న కృషి మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది .విద్యార్థి పునాదులు పాఠశాల స్థాయి నుండే బలోపేతం కావాలని లక్ష్యంగా ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతుంది. అదే బాటలో పయనిస్తూ ఇటీవల టీ శాట్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ తో ప్రసారాలపై ఎం ఓ యు  కుదుర్చుకున్నది.

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి కూడా ప్రైవేట్ విద్యా సంస్థలో చదివే విద్యార్థితో సమానమైన నాణ్యమైన విద్య  అందాలన్నదే ప్రభుత్వ విద్య వ్యవస్థ లక్ష్యం కావాలనే మనం కోరుకుంటాం. అయితే తరగతి గదిలో మంచి బోధనతో పాటు పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, మోడల్ పరీక్షలు, ప్రాక్టీస్ టెస్టులు, కెరీర్ మార్గదర్శకత్వం కూడా అవసరపడుతుంది. ఈ అవసరాన్ని గుర్తించి తమ కార్యక్రమాలను క్రమంగా విస్తరిస్తున్న టీ శాట్ ఇటీవల నిర్వహించిన ఎప్ సెట్ డిజిటల్ కోర్స్  ఇందుకు మంచి ఉదాహరణ. ఇందులో భాగంగా 112 రోజుల పాటు 450 అకాడమిక్ మాడ్యూల్స్ ను ప్రసారం చేసి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ,బోటనీ, జువాలజీ లాంటి ప్రధాన సబ్జెక్టులపై నిపుణులతో డిజిటల్ పాఠాలను అందించింది. టీవీ ప్రసారంతో పాటు డిజిటల్ వేదికల ద్వారా కూడా విద్యార్థులకు ఈ ఉచిత డిజిటల్ కంటెంట్ అందుబాటులో  ఉండేలా చర్యలు తీసుకుంది. ఇక్కడ టీ శాట్ ప్రత్యేకత కేవలం పాఠాలు చెప్పడం  లోనే లేదు, విద్యార్థులు పరీక్షకు సిద్ధమయ్యే విధంగా మోడల్ పరీక్షలు, ప్రాక్టీస్ ప్రశ్నలు, సబ్జెక్టు వారీగా పరీక్షా సన్నద్ధత, పరీక్ష విధానం పై అవగాహన వంటి అంశాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రవేశ పరీక్షలకు  సన్నద్ధం అయ్యేందుకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని విద్యార్థులకు ఇలాంటి" ఉచిత డిజిటల్ కంటెంట్ " ఎంతో ఉపయోగకరం. ఎప్ సెట్ తో పాటు జేఈఈ మెయిన్స్, పాలిసెట్, గురుకుల సెట్, పీజీ సెట్, గ్రూప్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్ బి,పోలీసు ఉద్యోగాలు, డీఎస్సీ, టెట్ వంటి వివిధ పోటీ పరీక్షలకు కూడా టీ శాట్ ప్రత్యేక కార్యక్రమాలను ఉచితంగా అందిస్తుంది.

ఆగస్టు 22న పాఠశాల విద్యా డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ టీ శాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి మధ్య కుదిరిన ఒప్పందం పాఠశాల విద్య వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ ఒప్పందం ద్వారా 9, 10 తరగతుల విద్యార్థులకు సాయంత్రం వేళల్లో డిజిటల్ పాఠాలను టీ శాట్ ద్వారా ప్రసారం చేయనుండడంతో పాఠశాలల ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పునఃశ్చరణ చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాదు రాష్ట్రంలోని సుమారు 28 వేల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి నిర్వహించే ముఖాముఖి కార్యక్రమాలు ,మా జిల్లా మా పాఠశాల, ఉపాధ్యాయుల కోసం నిర్వహించే టిఎల్ఎం మేళాలు, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాలు కూడా టీ శాట్ లో ప్రసారమవుతాయి. టీ శాట్ వివిధ విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా సంస్థలు, విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోవడం ప్రభుత్వ విద్య బలోపేతానికి సానుకూలంగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.ఇటీవల మహాత్మా గాంధీ యూనివర్సిటీ తో కుదిరిన ఎం ఓ యు  తో ఆన్లైన్ లో విద్యా అవకాశాలను విస్తరించడానికి చర్యలు చేపట్టారు. టీ శాట్ పేద విద్యార్థికి "ఉచిత డిజిటల్ కోచింగ్ సెంటర్". గ్రామీణ విద్యార్థికి "నాణ్యమైన విద్యా వేదిక". పోటీ పరీక్షల అభ్యర్థికి "మార్గదర్శి" .ప్రభుత్వ విద్య కోసం "సాంకేతిక బలం"  అని చెప్పవచ్చు. 

25, ఆగస్టు 2026, మంగళవారం

రూ 1 కే.. ఫంక్షన్ హాల్..

 పేదలు, మధ్య తరగతి వర్గాల వారు శుభ కార్యాలు చేసుకోవడానికి రూపాయికే ఫంక్షన్ హాల్/ వేడుక వేదిక ను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. అంటే ప్రజలు దాదాపుగా ఉచితంగానే ఈ సౌకర్యం పొందుతారు అని చెప్పవచ్చు. 

ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఫంక్షన్ హాల్ ను ఆగస్టు 16 న మంత్రి నారాయణ గారు ప్రారంభించారు. అప్పుడే దీనిని ఒక రూపాయికి అద్దెకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. హాలు మొత్తం సెంట్రల్ ఏసీ, టైల్స్ తో కార్పొరేట్ స్థాయిలో నిర్మించారు. దీని సామర్థ్యం 5 వేలు కాగా, పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. ఎన్ క్యాప్ నిధులు రూ.25 లక్షలు, కార్పొరేషన్ కు చెందిన రూ.1.15 కోట్లు ఖర్చు చేశారు.

బస్సు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ @ తమిళనాడు

 తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అసెంబ్లీ వేదికగా సోమవారం నాడు పలు కీలక సంక్షేమ పథకాలను ప్రకటించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి" ఏడాదికి మూడు ఉచిత ఎల్పిజి సిలిండర్లు " అందించనున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ సూపర్ సిక్స్ పథకం కింద దీనిని అమలు చేస్తామని చెప్పారు .లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు నేరుగా జమ అయ్యేలా పథకాన్ని అమలు చేస్తామని ,వచ్చే ఏడాది పొంగల్ నుంచి ఈ పథకం అమలు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద ఒక కోటి 30 లక్షల కుటుంబాలకు లాభం చేకూరనున్నది.

 మహిళలు, ట్రాన్స్ జెండర్ ల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత విస్తరిస్తూ " వెట్రి పయన తిట్టం"  పథకాన్ని కూడా ఆయన ప్రకటించారు. ఈ పథకం ద్వారా ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించడంతో పాటు మహిళల కోసం దీని పరిధిని విస్తరించారు. ఇకపై ఎక్స్ప్రెస్ ,లిమిటెడ్ స్టాప్ సర్వీస్, డీలక్స్ బస్సులు, సబర్బన్, కొండ ప్రాంతాలలో నడిచే సాధారణ చార్జీల బస్సులోను మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఉచితంగా ప్రయాణం సాగించవచ్చు. ఈ పథకానికి ఎలాంటి ఆదాయ పరిమితి ,ప్రయాణాల సంఖ్య పై నిబంధనలు ఏమీ ఉండవని సీఎం స్పష్టం చేశారు. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నదని తెలిపారు. 

ఉచిత శిక్షణ కోర్సులు@ నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ

 నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచితంగా వివిధ కోర్సులలో శిక్షణ అందించి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఆకుల మంజుల ఆకాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు . దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం కింద ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

శిక్షణ అందించే రంగాలు..

 హెల్త్ కేర్  సెక్టార్, కంప్యూటర్ కోర్సులు, కమ్యూనికేషన్స్ స్కిల్స్. 

వయస్సు.. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు గల యువతి యువకులు ఈ ఉచిత శిక్షణకు అర్హులు.

 విద్యార్హత.. పదవ తరగతి లేదా ఆ పైన ఉత్తీర్ణత సాధించి ఉండాలి .

కావలసిన పత్రాలు..

ఆధార్ కార్డు, పదవ తరగతి మెమో, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో రావాలని తెలిపారు.

 ఆసక్తి గల అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో

 నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయం,

 ఎండల టవర్స్ ఎదురుగా ,

వినాయక్ నగర్ ,నిజామాబాద్

 నందు సంప్రదించాలని సూచించారు.

 మరిన్ని సమగ్ర వివరాల కోసం 63039 93849 ,95024 25603 మొబైల్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. 

21, ఆగస్టు 2026, శుక్రవారం

ఏడాది పాటు " ఫ్రీ గూగుల్ ఏ ఐ ప్లస్"

 విద్యార్థులకు గూగుల్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది.. 

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారతీయ కాలేజీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది." గూగుల్ ఏ ఐ ప్లస్" సబ్ స్క్రిప్షన్ ను" ఏడాది పాటు ఉచితంగా" అందించనున్నట్లు ప్రకటించింది.

గూగుల్ ఏ ఐ అసిస్టెంట్,సెర్చ్ ద్వారా ఎడ్యుకేషనల్ టూల్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది . అమెరికా లోని కాలేజీ విద్యార్థులకు గూగుల్ ఏ ఐ ప్రో ప్లాన్ ను ఉచితంగా అందిస్తుండగా.. ఇప్పుడు భారతీయ కాలేజీ విద్యార్థుల కోసం " గూగుల్ ఏ ఐ ప్లస్" ను తీసుకు రానున్నది.

20, ఆగస్టు 2026, గురువారం

మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ @ బెంగళూరు

 బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ ఝాన్సీ బీవీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ,కుటుంబ కష్టాలను అధిగమించి తాను ఆటో నడుపుతూ, హ్యాండిల్ పట్టి తన జీవితాన్ని చక్కదిద్దుకున్న ఆమె ప్రస్తుతం తోటి మహిళలకు" ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ"  ఇస్తూ వారి ఆర్థిక స్వాతంత్రానికి ఆశాదీపం గా నిలుస్తోంది. 

ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ధైర్యంగా బెంగళూరు వీధులలో ఆటో తోలుతూ ,తోటి మహిళలకు ఆటో నడపడం నేర్పించే శిక్షకురాలిగా సమాజం గుర్తిస్తోందని, కానీ తన మార్గంలో దారి పొడవునా కన్నీళ్ళు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అడ్డంకులు ఎన్నో ఉన్నాయంటారు జాన్సీ. 

నేను ఆటో హ్యాండిల్ పట్టి రోజు వారి ఆదాయం పొందుతూ ఆర్థికంగా నిలదోక్కుకున్నాక నా ఆలోచన ధోరణిలో ఒక పెద్ద మార్పు వచ్చింది .బెంగళూరు వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్న మహిళలు కనిపించేవారు. కానీ వారికి సరైన దారి చూపించే వారు లేరని నాకు అర్థమైంది. 2021 లో ఇందిరానగర్ ఆర్టిఏ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు .అక్కడ ఉపాధి పొందే తపన ఉండి కూడా డ్రైవింగ్ నేర్చుకోవడానికి తగిన అవకాశాలు లేదా ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న కొందరు మహిళలను ప్రత్యక్షంగా చూశాను. ఆ క్షణమే ఒక స్థిర నిశ్చయానికి వచ్చాను. దేవుడు నాకిచ్చిన ఈ నైపుణ్యాన్ని, నా అనుభవాన్ని తోటి సోదరీమణులకు" ఉచితంగా పంచాలని"  నిర్ణయించుకున్నాను. 

ఆ రోజు నుంచి ఉపాధి కోరుకునే మహిళలకు "ఉచితంగా ఆటో డ్రైవింగ్ తరగతులు"  ప్రారంభించాను. నా దగ్గరకు వచ్చే ప్రతి మహిళకు వాహనం నడపడమే కాకుండా, రోడ్డు భద్రత నియమాలు, వాహన నిర్వహణ ,ప్రయాణికులతో ఎలా నడుచుకోవాలో కూడా నేర్పిస్తున్నాను. ఇప్పటివరకు బెంగళూరు నగరంలో వందలాది మంది మహిళలకు రూపాయి కూడా తీసుకోకుండా ఆటో డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చాను. నాలుగు గోడలకే పరిమితమైన గృహిణులు, తక్కువ జీతాలతో ఇబ్బందులు పడుతున్న మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలన్నదే నా ఆశయం. నా వద్ద శిక్షణ తీసుకున్న మహిళలు ఈరోజు బెంగళూరు రోడ్లపై ఎంతో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఆటోలు నడుపుతూ వారి కాళ్లపై వారు నిలబడుతున్నారు. అది చూసినప్పుడు ఆనందంగా ఉంటుంది అంటారు ఝాన్సీ బీవీ. 



ఫ్రీ CPR ట్రైనింగ్@డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్

 


గుండె ఆగిపోయిన మనిషికి తిరిగి ప్రాణం పోసే ప్రక్రియ సి పి ఆర్ ..దీనిని ఎంతమందికి నేర్పిస్తే సమాజానికి అంత మేలు చేసిన వాళ్ళం అవుతాము అన్నది తమ సంకల్పమని డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ నర్లింగల కీర్తన యాదవ్ అన్నారు.

 అందుకే తెలంగాణ వ్యాప్తంగా కాలేజీలు, కోర్టులు, పోలీసు కార్యాలయాలు సహా వివిధ చోట్ల క్యాంపులు నిర్వహించి ఇప్పటివరకు సుమారు లక్ష మందికి" ఉచితంగా సి పి ఆర్ ట్రైనింగ్"  ఇచ్చినట్లు తెలిపారు. రెడ్ క్రాస్, హ్యాండ్స్ ఆన్ హార్ట్ ఫౌండేషన్లు తమతో కలిసి పని చేస్తున్నాయని ఆమె వివరించారు. దీనితో పాటుగా కొన్ని అత్యవసర ప్రాథమిక చికిత్సలను పౌరులకు నేర్పుతున్నట్లు చెప్పారు. కరెంటు షాక్ కొట్టినప్పుడు, పాము కరిచినప్పుడు, ఫిట్స్ వచ్చినప్పుడు ,పిల్లలకు ఏదైనా గొంతులో అడ్డుపడినప్పుడు, బీపీ డౌన్ అయితే, షుగర్ స్థాయిలు పడిపోతే.. ఇలా ప్రాణం పోయే పరిస్థితులలో ఆసుపత్రిలో చేర్చేలోగా ఎలాంటి సహాయం అందించాలి అనేది కూడా ఈ క్యాంపెయిన్ లో భాగంగా  నేర్పుతున్నామని ఆమె వివరించారు.

 ఎవరైనా తమ కార్యక్రమంలో భాగం అవ్వాలనుకుంటే drnaari అనే ఇంస్టాగ్రామ్ పేజీ లేదా drnaari.com అనే వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. 



వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...