28, ఆగస్టు 2026, శుక్రవారం

ఉచిత డిజిటల్ కంటెంట్@టీ - శాట్

 విద్య అనేది ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు ఒక కుటుంబం భవిష్యత్తును, సమాజం యొక్క అభివృద్ధిని మార్చ గలిగే శక్తి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తే వారి జీవితాలలో ఒక మంచి మార్పు అనేది వస్తుంది. ఈ ఆలోచనతోనే తెలంగాణలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి విద్యాసంస్థలలో మౌలిక వసతులు మెరుగు పరచడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంచేందుకు వినూత్నమైన చర్యలు చేపడుతుంది. ఈ ప్రయత్నాలకు సాంకేతికని జోడిస్తూ టీ శాట్ చేస్తున్న కృషి మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది .విద్యార్థి పునాదులు పాఠశాల స్థాయి నుండే బలోపేతం కావాలని లక్ష్యంగా ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతుంది. అదే బాటలో పయనిస్తూ ఇటీవల టీ శాట్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ తో ప్రసారాలపై ఎం ఓ యు  కుదుర్చుకున్నది.

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి కూడా ప్రైవేట్ విద్యా సంస్థలో చదివే విద్యార్థితో సమానమైన నాణ్యమైన విద్య  అందాలన్నదే ప్రభుత్వ విద్య వ్యవస్థ లక్ష్యం కావాలనే మనం కోరుకుంటాం. అయితే తరగతి గదిలో మంచి బోధనతో పాటు పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, మోడల్ పరీక్షలు, ప్రాక్టీస్ టెస్టులు, కెరీర్ మార్గదర్శకత్వం కూడా అవసరపడుతుంది. ఈ అవసరాన్ని గుర్తించి తమ కార్యక్రమాలను క్రమంగా విస్తరిస్తున్న టీ శాట్ ఇటీవల నిర్వహించిన ఎప్ సెట్ డిజిటల్ కోర్స్  ఇందుకు మంచి ఉదాహరణ. ఇందులో భాగంగా 112 రోజుల పాటు 450 అకాడమిక్ మాడ్యూల్స్ ను ప్రసారం చేసి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ,బోటనీ, జువాలజీ లాంటి ప్రధాన సబ్జెక్టులపై నిపుణులతో డిజిటల్ పాఠాలను అందించింది. టీవీ ప్రసారంతో పాటు డిజిటల్ వేదికల ద్వారా కూడా విద్యార్థులకు ఈ ఉచిత డిజిటల్ కంటెంట్ అందుబాటులో  ఉండేలా చర్యలు తీసుకుంది. ఇక్కడ టీ శాట్ ప్రత్యేకత కేవలం పాఠాలు చెప్పడం  లోనే లేదు, విద్యార్థులు పరీక్షకు సిద్ధమయ్యే విధంగా మోడల్ పరీక్షలు, ప్రాక్టీస్ ప్రశ్నలు, సబ్జెక్టు వారీగా పరీక్షా సన్నద్ధత, పరీక్ష విధానం పై అవగాహన వంటి అంశాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రవేశ పరీక్షలకు  సన్నద్ధం అయ్యేందుకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని విద్యార్థులకు ఇలాంటి" ఉచిత డిజిటల్ కంటెంట్ " ఎంతో ఉపయోగకరం. ఎప్ సెట్ తో పాటు జేఈఈ మెయిన్స్, పాలిసెట్, గురుకుల సెట్, పీజీ సెట్, గ్రూప్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్ బి,పోలీసు ఉద్యోగాలు, డీఎస్సీ, టెట్ వంటి వివిధ పోటీ పరీక్షలకు కూడా టీ శాట్ ప్రత్యేక కార్యక్రమాలను ఉచితంగా అందిస్తుంది.

ఆగస్టు 22న పాఠశాల విద్యా డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ టీ శాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి మధ్య కుదిరిన ఒప్పందం పాఠశాల విద్య వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ ఒప్పందం ద్వారా 9, 10 తరగతుల విద్యార్థులకు సాయంత్రం వేళల్లో డిజిటల్ పాఠాలను టీ శాట్ ద్వారా ప్రసారం చేయనుండడంతో పాఠశాలల ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పునఃశ్చరణ చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాదు రాష్ట్రంలోని సుమారు 28 వేల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి నిర్వహించే ముఖాముఖి కార్యక్రమాలు ,మా జిల్లా మా పాఠశాల, ఉపాధ్యాయుల కోసం నిర్వహించే టిఎల్ఎం మేళాలు, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాలు కూడా టీ శాట్ లో ప్రసారమవుతాయి. టీ శాట్ వివిధ విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా సంస్థలు, విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోవడం ప్రభుత్వ విద్య బలోపేతానికి సానుకూలంగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.ఇటీవల మహాత్మా గాంధీ యూనివర్సిటీ తో కుదిరిన ఎం ఓ యు  తో ఆన్లైన్ లో విద్యా అవకాశాలను విస్తరించడానికి చర్యలు చేపట్టారు. టీ శాట్ పేద విద్యార్థికి "ఉచిత డిజిటల్ కోచింగ్ సెంటర్". గ్రామీణ విద్యార్థికి "నాణ్యమైన విద్యా వేదిక". పోటీ పరీక్షల అభ్యర్థికి "మార్గదర్శి" .ప్రభుత్వ విద్య కోసం "సాంకేతిక బలం"  అని చెప్పవచ్చు. 

25, ఆగస్టు 2026, మంగళవారం

రూ 1 కే.. ఫంక్షన్ హాల్..

 పేదలు, మధ్య తరగతి వర్గాల వారు శుభ కార్యాలు చేసుకోవడానికి రూపాయికే ఫంక్షన్ హాల్/ వేడుక వేదిక ను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. అంటే ప్రజలు దాదాపుగా ఉచితంగానే ఈ సౌకర్యం పొందుతారు అని చెప్పవచ్చు. 

ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఫంక్షన్ హాల్ ను ఆగస్టు 16 న మంత్రి నారాయణ గారు ప్రారంభించారు. అప్పుడే దీనిని ఒక రూపాయికి అద్దెకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. హాలు మొత్తం సెంట్రల్ ఏసీ, టైల్స్ తో కార్పొరేట్ స్థాయిలో నిర్మించారు. దీని సామర్థ్యం 5 వేలు కాగా, పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. ఎన్ క్యాప్ నిధులు రూ.25 లక్షలు, కార్పొరేషన్ కు చెందిన రూ.1.15 కోట్లు ఖర్చు చేశారు.

బస్సు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ @ తమిళనాడు

 తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అసెంబ్లీ వేదికగా సోమవారం నాడు పలు కీలక సంక్షేమ పథకాలను ప్రకటించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి" ఏడాదికి మూడు ఉచిత ఎల్పిజి సిలిండర్లు " అందించనున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ సూపర్ సిక్స్ పథకం కింద దీనిని అమలు చేస్తామని చెప్పారు .లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు నేరుగా జమ అయ్యేలా పథకాన్ని అమలు చేస్తామని ,వచ్చే ఏడాది పొంగల్ నుంచి ఈ పథకం అమలు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద ఒక కోటి 30 లక్షల కుటుంబాలకు లాభం చేకూరనున్నది.

 మహిళలు, ట్రాన్స్ జెండర్ ల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత విస్తరిస్తూ " వెట్రి పయన తిట్టం"  పథకాన్ని కూడా ఆయన ప్రకటించారు. ఈ పథకం ద్వారా ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించడంతో పాటు మహిళల కోసం దీని పరిధిని విస్తరించారు. ఇకపై ఎక్స్ప్రెస్ ,లిమిటెడ్ స్టాప్ సర్వీస్, డీలక్స్ బస్సులు, సబర్బన్, కొండ ప్రాంతాలలో నడిచే సాధారణ చార్జీల బస్సులోను మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఉచితంగా ప్రయాణం సాగించవచ్చు. ఈ పథకానికి ఎలాంటి ఆదాయ పరిమితి ,ప్రయాణాల సంఖ్య పై నిబంధనలు ఏమీ ఉండవని సీఎం స్పష్టం చేశారు. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నదని తెలిపారు. 

ఉచిత శిక్షణ కోర్సులు@ నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ

 నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచితంగా వివిధ కోర్సులలో శిక్షణ అందించి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఆకుల మంజుల ఆకాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు . దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం కింద ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

శిక్షణ అందించే రంగాలు..

 హెల్త్ కేర్  సెక్టార్, కంప్యూటర్ కోర్సులు, కమ్యూనికేషన్స్ స్కిల్స్. 

వయస్సు.. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు గల యువతి యువకులు ఈ ఉచిత శిక్షణకు అర్హులు.

 విద్యార్హత.. పదవ తరగతి లేదా ఆ పైన ఉత్తీర్ణత సాధించి ఉండాలి .

కావలసిన పత్రాలు..

ఆధార్ కార్డు, పదవ తరగతి మెమో, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో రావాలని తెలిపారు.

 ఆసక్తి గల అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో

 నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయం,

 ఎండల టవర్స్ ఎదురుగా ,

వినాయక్ నగర్ ,నిజామాబాద్

 నందు సంప్రదించాలని సూచించారు.

 మరిన్ని సమగ్ర వివరాల కోసం 63039 93849 ,95024 25603 మొబైల్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. 

21, ఆగస్టు 2026, శుక్రవారం

ఏడాది పాటు " ఫ్రీ గూగుల్ ఏ ఐ ప్లస్"

 విద్యార్థులకు గూగుల్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది.. 

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారతీయ కాలేజీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది." గూగుల్ ఏ ఐ ప్లస్" సబ్ స్క్రిప్షన్ ను" ఏడాది పాటు ఉచితంగా" అందించనున్నట్లు ప్రకటించింది.

గూగుల్ ఏ ఐ అసిస్టెంట్,సెర్చ్ ద్వారా ఎడ్యుకేషనల్ టూల్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది . అమెరికా లోని కాలేజీ విద్యార్థులకు గూగుల్ ఏ ఐ ప్రో ప్లాన్ ను ఉచితంగా అందిస్తుండగా.. ఇప్పుడు భారతీయ కాలేజీ విద్యార్థుల కోసం " గూగుల్ ఏ ఐ ప్లస్" ను తీసుకు రానున్నది.

20, ఆగస్టు 2026, గురువారం

మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ @ బెంగళూరు

 బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ ఝాన్సీ బీవీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ,కుటుంబ కష్టాలను అధిగమించి తాను ఆటో నడుపుతూ, హ్యాండిల్ పట్టి తన జీవితాన్ని చక్కదిద్దుకున్న ఆమె ప్రస్తుతం తోటి మహిళలకు" ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ"  ఇస్తూ వారి ఆర్థిక స్వాతంత్రానికి ఆశాదీపం గా నిలుస్తోంది. 

ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ధైర్యంగా బెంగళూరు వీధులలో ఆటో తోలుతూ ,తోటి మహిళలకు ఆటో నడపడం నేర్పించే శిక్షకురాలిగా సమాజం గుర్తిస్తోందని, కానీ తన మార్గంలో దారి పొడవునా కన్నీళ్ళు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అడ్డంకులు ఎన్నో ఉన్నాయంటారు జాన్సీ. 

నేను ఆటో హ్యాండిల్ పట్టి రోజు వారి ఆదాయం పొందుతూ ఆర్థికంగా నిలదోక్కుకున్నాక నా ఆలోచన ధోరణిలో ఒక పెద్ద మార్పు వచ్చింది .బెంగళూరు వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్న మహిళలు కనిపించేవారు. కానీ వారికి సరైన దారి చూపించే వారు లేరని నాకు అర్థమైంది. 2021 లో ఇందిరానగర్ ఆర్టిఏ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు .అక్కడ ఉపాధి పొందే తపన ఉండి కూడా డ్రైవింగ్ నేర్చుకోవడానికి తగిన అవకాశాలు లేదా ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న కొందరు మహిళలను ప్రత్యక్షంగా చూశాను. ఆ క్షణమే ఒక స్థిర నిశ్చయానికి వచ్చాను. దేవుడు నాకిచ్చిన ఈ నైపుణ్యాన్ని, నా అనుభవాన్ని తోటి సోదరీమణులకు" ఉచితంగా పంచాలని"  నిర్ణయించుకున్నాను. 

ఆ రోజు నుంచి ఉపాధి కోరుకునే మహిళలకు "ఉచితంగా ఆటో డ్రైవింగ్ తరగతులు"  ప్రారంభించాను. నా దగ్గరకు వచ్చే ప్రతి మహిళకు వాహనం నడపడమే కాకుండా, రోడ్డు భద్రత నియమాలు, వాహన నిర్వహణ ,ప్రయాణికులతో ఎలా నడుచుకోవాలో కూడా నేర్పిస్తున్నాను. ఇప్పటివరకు బెంగళూరు నగరంలో వందలాది మంది మహిళలకు రూపాయి కూడా తీసుకోకుండా ఆటో డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చాను. నాలుగు గోడలకే పరిమితమైన గృహిణులు, తక్కువ జీతాలతో ఇబ్బందులు పడుతున్న మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలన్నదే నా ఆశయం. నా వద్ద శిక్షణ తీసుకున్న మహిళలు ఈరోజు బెంగళూరు రోడ్లపై ఎంతో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఆటోలు నడుపుతూ వారి కాళ్లపై వారు నిలబడుతున్నారు. అది చూసినప్పుడు ఆనందంగా ఉంటుంది అంటారు ఝాన్సీ బీవీ. 



ఫ్రీ CPR ట్రైనింగ్@డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్

 


గుండె ఆగిపోయిన మనిషికి తిరిగి ప్రాణం పోసే ప్రక్రియ సి పి ఆర్ ..దీనిని ఎంతమందికి నేర్పిస్తే సమాజానికి అంత మేలు చేసిన వాళ్ళం అవుతాము అన్నది తమ సంకల్పమని డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ నర్లింగల కీర్తన యాదవ్ అన్నారు.

 అందుకే తెలంగాణ వ్యాప్తంగా కాలేజీలు, కోర్టులు, పోలీసు కార్యాలయాలు సహా వివిధ చోట్ల క్యాంపులు నిర్వహించి ఇప్పటివరకు సుమారు లక్ష మందికి" ఉచితంగా సి పి ఆర్ ట్రైనింగ్"  ఇచ్చినట్లు తెలిపారు. రెడ్ క్రాస్, హ్యాండ్స్ ఆన్ హార్ట్ ఫౌండేషన్లు తమతో కలిసి పని చేస్తున్నాయని ఆమె వివరించారు. దీనితో పాటుగా కొన్ని అత్యవసర ప్రాథమిక చికిత్సలను పౌరులకు నేర్పుతున్నట్లు చెప్పారు. కరెంటు షాక్ కొట్టినప్పుడు, పాము కరిచినప్పుడు, ఫిట్స్ వచ్చినప్పుడు ,పిల్లలకు ఏదైనా గొంతులో అడ్డుపడినప్పుడు, బీపీ డౌన్ అయితే, షుగర్ స్థాయిలు పడిపోతే.. ఇలా ప్రాణం పోయే పరిస్థితులలో ఆసుపత్రిలో చేర్చేలోగా ఎలాంటి సహాయం అందించాలి అనేది కూడా ఈ క్యాంపెయిన్ లో భాగంగా  నేర్పుతున్నామని ఆమె వివరించారు.

 ఎవరైనా తమ కార్యక్రమంలో భాగం అవ్వాలనుకుంటే drnaari అనే ఇంస్టాగ్రామ్ పేజీ లేదా drnaari.com అనే వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. 



ఫిజిక్స్ వాలా నేషనల్ స్కాలర్ షిప్ కం అడ్మిషన్ టెస్ట్ 2026

 నీట్ , జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఫిజిక్స్ వాలా నేషనల్ స్కాలర్షిప్ కం అడ్మిషన్ టెస్ట్ 2026 నాలుగవ ఎడిషన్ను ప్రకటించింది .ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్, ఫిజిక్స్ ,కెమిస్ట్రీ, బయాలజీ విభాగాలకు చెందిన ఐదు నుంచి 12వ తరగతి విద్యార్థులు, 12వ తరగతి పాసైన విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు" ఉచితంగా పేర్లను నమోదు"  చేసుకోవచ్చని వెల్లడించింది. అర్హులైన విద్యార్థులు 100% వరకు ట్యూషన్ ఫీజు మినహాయింపు తో కూడిన స్కాలర్షిప్ లను పొందవచ్చని, అర్హులైన మొదటి 500 మంది విద్యార్థులకు" ఉచిత విద్యను ఉచిత హాస్టల్ వసతిని"  కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఆన్లైన్ పరీక్షను ఎంచుకునే విద్యార్థులు అక్టోబర్ 1 నుంచి 15 మధ్య పరీక్షకు హాజరు కావచ్చు అని, ఆఫ్లైన్ పరీక్షలు అక్టోబర్ 3,4, 10, 11 తేదీలలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. 

ఫ్లైబ్రరీ.. ఉచిత గ్రంథాలయం @ ఎయిర్ పోర్ట్

 విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత విమానం కోసం ఎదురు చూడడం కొందరికి బోర్ గ అనిపిస్తుంది. ఫోన్లో స్క్రోల్ చేస్తూ సమయం గడిపిన కొద్దిసేపటికి విసుగు వస్తుంది. అదే మంచి పుస్తకం చేతిలో ఉంటే.. చదవాలని ఉండి రోజువారి జీవితంలో సమయం దొరకని పుస్తకాన్ని ప్రశాంతంగా చదివే అవకాశం వస్తే, అంతకంటే ఆనందం మరొకటి ఉండదు అని చెప్పవచ్చు.

 ఈ ఆలోచనతోనే కొన్ని విమానాశ్రయాలలో ఫ్లైబ్రరీలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఫ్లైబ్రరీ అంటే" విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఉచిత గ్రంథాలయం". విమానం కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు తమకు నచ్చిన పుస్తకాన్ని తీసుకొని చదవవచ్చు. విమానం వచ్చేసినా చదవడం పూర్తి కాకపోతే ఆ పుస్తకాన్ని వెంట తీసుకెళ్లి ప్రయాణంలో కూడా చదువుకోవచ్చు. అనంతరం వారు దిగిన విమానాశ్రయంలోని ఫ్లైబ్రరీలో దానిని ఇచ్చి వెళ్లిపోవచ్చు .

భువనేశ్వర్ లో మొదలైంది..

 ఈ తరహా ప్రయోగానికి భువనేశ్వర్ లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదిక అయింది. 2025 లో "టేక్ ఏ బుక్ " అనే నినాదంతో లైబ్రరీని ప్రారంభించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయంలో ఇంగ్లీష్, హిందీ, ఒడియా భాషలలో సుమారు 600 పుస్తకాలు అందుబాటులో ఉంచారు. బాలల పుస్తకాలు, నవలలు, మేగజైన్లు  తదితర విభాగాలకు చెందిన పుస్తకాలు కూడా ఇందులో ఉన్నాయి. డిపార్చర్ ,అరైవల్ ప్రాంతాలలో పుస్తకాల అరలని ఏర్పాటు చేశారు. ఇందులో పుస్తకాల నిర్వహణ ,అరలని సర్దడం వంటి పనులలో వాలంటీర్లు సహకరిస్తున్నారు. ఇక ఈ ఆలోచనకు ఇతర విమానాశ్రయాలలోనూ ఆదరణ లభిస్తోంది. తాజాగా ప్రయాగరాజ్ విమానాశ్రయంలోను ఫ్లైబ్రరీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాలను విరాళంగాను ఇవ్వవచ్చు .. ఈ ఫ్లైబ్రరీల ఏర్పాటు కేవలం సమయాన్ని సద్వినియోగం చేయాలని ఆలోచనతో రూపుదిద్దుకున్న కార్యక్రమం. ప్రయాణికుల మీద నమ్మకం, సమాజ భాగస్వామ్యం పై ఆధారపడి పని చేస్తుంది. పుస్తకాలను తీసుకున్న వారు తిరిగి ఇచ్చే విషయంలో స్వీయ బాధ్యతతో వ్యవహరించాలి. ఈ ఫ్లైబ్రరీల కోసం పుస్తకాలను విరాళంగా కూడా ఇవ్వవచ్చు అని నిర్వాహకులు కోరుతున్నారు. 



19, ఆగస్టు 2026, బుధవారం

ప్రతి నెలా.. ఉచిత జాబ్ మేళా @ నిజామాబాద్

 నిరుద్యోగుల కోసం ఇక నుంచి" ప్రతి నెలా ఉచిత జాబ్ మేళా" నిర్వహించనున్నట్లు నిజామాబాద్ జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ వేల్పుల విజేత తెలిపారు. గత నెల నిర్వహించిన మెగా జాబ్ మేళా లో 4620 మంది టామ్ కామ్ లో నమోదు కాగా 120 మంది జర్మనీ లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. 

వారందరూ జర్మనీ భాష నేర్చుకోవడానికి " ఫ్రీ కోచింగ్ సెంటర్" ను ఏర్పాటు చేశామని తెలిపారు.

నిజామాబాద్ నగరంలో మంగళ వారం 168 పోస్టులకు( నర్సులు,రిసెప్షనిస్ట్, ఫార్మసిస్ట్ , షోరూం మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ,మెకానిక్) ఉచిత  జాబ్ మేళా నిర్వహించగా 52 మంది సెలెక్ట్ అయ్యారని ,వారికి ప్రూండెన్స్ హాస్పిటల్, అపోలో ఫార్మసీ, మహీంద్రా షోరూం ల నుండి వచ్చిన ప్రతినిధులు జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అపాయింట్మెంట్ లెటర్స్ అందచేశారని తెలిపారు. 

ఇకనుంచి ప్రతి నెలా నిరుద్యోగుల కోసం " ఉచిత జాబ్ మేళా" నిర్వహించనున్నట్లు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

18, ఆగస్టు 2026, మంగళవారం

కృత్రిమ మేధ నుండి.. కుట్లు అల్లికల వరకు.. ఉచిత శిక్షణ

 నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ శాఖలతో పాటు , స్వచ్ఛంద సంస్థలు, గురుకులాలు, బ్యాంకులు, ఏ టి సి లు తదితర ఎన్నో సంస్థలలో యువతకు ఉపాధి అవకాశాలు పొందేందుకు, ఉద్యోగాలు పొందేందుకు , ఉన్నత విద్య లో ప్రవేశం పొందేందుకు .. ప్రవేశ పరీక్ష లకు " ఉచిత శిక్షణ లు " అందుబాటు లోనికి వచ్చాయి.. 

జీవితంలో ఎదగాలి,ఏదైనా సాధించాలి అనే తపన ఉన్న విద్యార్థులే కాకుండా నిరుద్యోగ యువత కు,మహిళలకు,కార్మికులకు ఇవి ఎంతో సహాయకారిగా ఉంటున్నాయి. చదువు పై శ్రద్ధ, నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఆసక్తి గలవారు ఉన్నత స్థాయి కి వెళ్లేందుకు ఈ ఉచిత శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయా సంస్థల నిర్వాహకులు పేర్కొంటారు..అలాంటి సంస్థల సంక్షిప్త వివరాలు ఇవి..

టాస్క్ లో నైపుణ్య అభివృద్ధి..

చదువుతో పాటు భవిష్యత్ లో ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి " టాస్క్" శిక్షణలు ఉపయోగపడతాయి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వివిధ కోర్సులు చదవొచ్చు. ప్రవేశాలకు ఈ నెల 31 వరకు గడువు ఉంది. కంప్యూటర్ కోడింగ్, లాంగ్వేజెస్, ఏ ఐ టూల్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. 

ప్రైవేట్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ముఖాముఖి, బృంద చర్చ నైపుణ్యాలు నేర్పుతారు.

పూర్తి సమగ్ర వివరాలకు 91542 52588 , 7013675052 జిల్లా మేనేజర్ రఘుతేజ్ ను సంప్రదించవచ్చు.

భవన నిర్మాణ రంగంలో..

కార్మిక సంక్షేమ శాఖ, న్యాక్ ఆధ్వర్యంలో ప్లంబింగ్,శానిటేషన్,పెయింటింగ్,డెకొరేషన్, తాపీ మేస్త్రి, ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్ పనులపై 15 రోజుల పాటు నైపుణ్యాలు నేర్పుతారు.

పూర్తి సమగ్ర వివరాలకు 98663 50200,99597 73079 నిజామాబాద్, 97045 87655 భీమ్ గల్.. ఫోన్ నెంబర్ లలో సంప్రదించాలని సూచిస్తున్నారు.. 

స్వయం ఉపాధి కోసం భరోసా..

డిచ్ పల్లిలోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో 19-45 ఏళ్ల వయసు గల గ్రామీణ మహిళలు ,యువతకు స్వయం ఉపాధి కోర్సులు నేర్పిస్తున్నారు.

మగ్గం వర్క్స్, హోం నీడ్స్ తయారీ,ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్,సర్వీస్,రిటైల్, కుట్టు మిషన్,కుట్లు అల్లికల లో నైపుణ్యం పొందవచ్చు.

పూర్తి సమగ్ర వివరాలకు..08461-222428 నంబరులో సంప్రదించాలి.

నైపుణ్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు పొందేందుకు..

పదో తరగతి పాసైన నిరుద్యోగ యువత కు వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవసరమైన శిక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము ను జిల్లాలోని 7  అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ( ఏ టీ సీ) లలో నేర్పిస్తున్నారు. 

ఇక్కడ అందించే కోర్సుల వివరాలు తెలుసుకునేందుకు నిజామాబాద్ లోని ప్రభుత్వ ఐటిఐ లో గానీ,94417 07536 నంబరును గానీ సంప్రదించవచ్చు. 

నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలకు..

నీట్, జేఈఈ మెయిన్స్ ఉన్నత విద్య పోటీ పరీక్షలకు ప్రైవేటులో శిక్షణ కు భారీగా ఖర్చు అవుతుంది.అందుకే జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, కేజీబీవీ సీ వో ఈ లలో వంద మంది విద్యార్థుల చొప్పున ఉచిత శిక్షణ ఇస్తున్నాయి.ఇటీవలే ఇంటర్ పాసైన వారికి లాంగ్ టర్మ్ శిక్షణ కు ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.సాంఘిక, బీసీ సంక్షేమ గురుకులాల ఆర్ సీ వో కార్యాలయాలలో సంప్రదించాలి.

బీసీ స్టడీ సర్కిల్ ఉచిత ఫౌండేషన్ శిక్షణ..

టీ జీ పీ ఎస్ సి గ్రూప్స్ తో పాటు బ్యాంకింగ్, ఆర్ ఆర్ బి , స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగార్థులకు .. నిజామాబాద్ లోని బీసీ స్టడీ సర్కిల్ లో 125 రోజులపాటు ఉచిత ఫౌండేషన్ శిక్షణ ఇస్తున్నారు . ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభ్యర్థులు అర్హులు.

పూర్తి సమగ్ర వివరాలకు 08462-241055 నంబరులో సంప్రదించాలి.

ఇవే కాకుండా వ్యవసాయ, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో " రైతు శిక్షణ", "పశు వైద్యం","పాల ఉత్పత్తి"  పై శిక్షణ లు అందుబాటు లో ఉన్నాయి. 

ఉచిత "అర్జంట్ కేర్ సెంటర్" @ జగిత్యాల

 గ్రామీణ ప్రాంత ప్రజలకు" ఉచితంగా అత్యవసర వైద్య సేవలు"  అందించడమే ప్రధాన లక్ష్యంగా" శ్రీ సత్య సాయి సుజల స్రవంతి ట్రస్ట్"  ఆధ్వర్యంలో జగిత్యాల గ్రామీణ టీ ఆర్ నగర్, రాజారాం గ్రామం వద్ద ఏర్పాటుచేసిన" సాయి స్వస్థ షా హ్యాపీనెస్ అర్జెంట్ కేర్ సెంటర్" ను ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, మునిసిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి సోమవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల, మల్యాల నియోజకవర్గాల పరిధిలోని గ్రామీణ ప్రజలకు ఈ కేంద్రం ద్వారా" ఉచితంగా అత్యవసర వైద్య సేవలు"  అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు సకాలంలో వైద్యం అందించడం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడవచ్చు అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలకు తోడుగా ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలను విరివిగా విస్తరింప చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, డిసిసి అధ్యక్షుడు గాజంగి నందయ్య తదితరులు పాల్గొన్నారు. 

17, ఆగస్టు 2026, సోమవారం

ఉచిత కరాటే శిక్షణ @ ఇబ్రహీం పేట్, బాన్సువాడ

 కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీం పేట్ గ్రామంలో చిన్నారులకు గ్రామీణ స్థాయిలో" ఉచితంగా కరాటే శిక్షణ శిబిరం"  ఆదివారం ప్రారంభించారు. 



ఈ సందర్భంగా కరాటే మాస్టర్ లు శివరాం, ఫణీందర్ గౌడ్ లు మాట్లాడుతూ .. "ప్రతి ఆదివారం" స్థానిక వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో కరాటే మాస్టర్ వినీల్ ఆధ్వర్యంలో ఉచితంగా కరాటే శిక్షణ నిర్వహించనున్నామని అన్నారు. 

చిన్నారుల్లో ఆత్మ విశ్వాసం, క్రమ శిక్షణ, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడంతో పాటుగా ఆత్మ రక్షణ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో శిక్షణ ప్రారంభించామన్నారు. ఈ అవకాశాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఉచిత శిక్షణ @ ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్

 ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నకిరేకల్ పట్టణంలో నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన "ఉచిత పోటీ పరీక్షల శిక్షణ శిబిరాన్ని"  తెలంగాణ ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం ఆదివారము ప్రారంభించారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు" మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ"  అందించనున్నామని ఆయన తెలిపారు .ఈ సమావేశంలో ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం మాట్లాడుతూ ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ 2015 లో ప్రారంభించామని అప్పటినుండి పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు, నకిరేకల్ పట్టణంలో "ఉద్దీపన పాఠశాల" ఏర్పాటు చేసి" ఉచిత విద్య"  అందిస్తున్నామని పేర్కొన్నారు. 

కరోనా సమయంలో కషాయ కేంద్రాలు, అవసరమైన కిట్ల పంపిణీ చేశామని, మృతుల అంత్యక్రియలలో కూడా దగ్గరుండి మానవతా సేవలు అందించామని గుర్తు చేశారు. నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, నకిరేకల్ పట్టణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఉచిత శిక్షణ పొందుతున్న ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. నిరుద్యోగ యువతకు అండగా నిలిచి లక్ష్య సాధనకు అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.



 ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, సీనియర్ నాయకులు పూజర్ల శంభయ్య ,చామల శ్రీనివాస్, నాగులవంచ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ బెల్లి యాదయ్య, ఆర్సి రెడ్డి కోచింగ్ అధ్యాపకులు వేముల సైదులు, మండల పార్టీ అధ్యక్షుడు గాధగోని కొండయ్య, టౌన్ అధ్యక్షులు లింగాల వెంకన్న , ఉద్దీపన కోఆర్డినేటర్ చెరుకు సతీష్, మాజీ కౌన్సిలర్లు ,నాయకులు ,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

16, ఆగస్టు 2026, ఆదివారం

కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్ ఉచిత సేవలు

 నిరుపేద విద్యార్థుల ముఖాలలో చిరునవ్వులు పూయిస్తూ వారి ఉన్నత చదువులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ ప్రణీత్ గ్రూప్ అధినేత నరేంద్ర కుమార్ కామరాజు ఆదర్శంగా నిలుస్తున్నారు. జీవితంలో రాణించాలంటే చదివే కీలకమని నమ్మిన వ్యక్తి ఆయన .ఆర్థిక సమస్యతో ఆ చదువు నిరుపేద విద్యార్థుల నుంచి దూరం కావద్దని తపన పడే మనిషి. అందుకే తన చిన్నప్పుడు మనకు ఉన్నంతలో ఇతరులకు సాయం చేయాలని నాయనమ్మ చెప్పిన మాటలు ఇప్పుడు అతని సేవా కార్యక్రమానికి ప్రేరణ నిస్తున్నాయి .ఇప్పటివరకు నగరంలో ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులకు స్పోర్ట్స్ షూస్, స్కూల్ బ్యాగులు ,వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. పదో తరగతిలో 500 మార్కులు దాటిన ఆయా  స్కూళ్లకు చెందిన 43 మంది విద్యార్థులకు తన నాయనమ్మ పేరు మీద ఏర్పాటు చేసిన" కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్"  ద్వారా ఒక్కొక్కరికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ మొత్తంగా 21 లక్షల రూపాయలు ప్రకటించారు. అయితే ఈ స్కాలర్షిప్ సహాయం ప్రతి ఏడాది కొనసాగనున్నది. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకున్న ప్రణీత గ్రూప్ అధినేత నరేంద్ర కుమార్ కామరాజు ట్రస్ట్ కార్యక్రమాల గురించి ఈ విధంగా వివరించారు. 



2007లో ప్రణీత్ గ్రూప్ కంపెనీ ఏర్పాటు చేసిన నరేంద్ర కుమార్ గారు అంచలంచలుగా సాగిన తన ప్రస్థానంలో వారి నాయనమ్మ గారు తరచూ చెప్పిన మాటలు తనను చాలా ప్రభావితం చేశాయన్నారు. తన తొలి జీతం మూడు వేల రూపాయలు వచ్చినప్పుడు కూడా అందులో 300 రూపాయలు సహాయం చేసే వాడిని .అన్నపూర్ణమ్మ ట్రస్ట్ తో స్కాలర్షిప్లు ఇవ్వడమే కాకుండా ఇప్పటివరకు 250 మంది విద్యార్థులను ఇంజనీరింగ్ ,ఎంబీఏ, ఎంసీఏ చదివించానని, ఇలా సహాయం అందుకున్న విద్యార్థులు చాలా గొప్ప స్థానాలలో ఉన్నారని.. ఒక విద్యార్థి అమెరికాలో స్థిరపడి తన ట్రస్ట్ మరిన్ని కార్యక్రమాలు చేయాలని తనవంతు సహాయం అందించాడని తెలిపారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా టీచర్లు ఉండకుండా ఉన్న సమస్యతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులలో సాధ్యమైనంత వరకు సంబంధిత పాఠశాలలో మంచి టీచర్లను నియమించే బాధ్యత ట్రస్ట్ తరఫున తీసుకుంటున్నామని ఆయన తెలిపారు .వారికి ట్రస్ట్ జీతాలు చెల్లిస్తుందని ,చాలామంది హెచ్ఎంలు తమ పాఠశాలలో టీచర్లను నియమించే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు .అందుకే మేము సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకొని వారి సూచనల మేరకు టీచర్ల నియామకానికి ప్రణాళికలు వేశామన్నారు. ఒక వ్యక్తి చదువుకొని బాగుపడితే ఆ కుటుంబం బాగుపడుతుంది .చదువు లేకున్న సాధించే వారు చాలామంది ఉన్నారు, కానీ చదువు ఆయుధం లాంటిదని నేను బలంగా నమ్ముతున్నాను. మహా అయితే 15 ఏళ్లు చదువుతాము, ఆ తర్వాత అంతా జీవిత పోరాటమే. అందుకే ఆ చదువు ఫౌండేషన్ బలంగా ఉంటే విద్యార్థులు గొప్పగా  రాణిస్తారు .

నాయనమ్మ ఆదర్శం..

 సాయం, సేవ చేయాలని ఆలోచన నేను మా నాయనమ్మ నుంచే నేర్చుకున్నాను. నాయనమ్మ పేరు అన్నపూర్ణమ్మ. ఆమెది తన వద్ద ఉన్నదాంట్లో కొంత సహాయం చేసే మనస్తత్వం. సహాయం చేయాలనే మనస్తత్వం ఉంటే డబ్బే కాదు ,ఏ రూపంలోనైనా సహాయం అందించగలను అని చెబుతుండేది. పది మందికి సహాయం చేసే ఆలోచనలు నాటుకు పోయేలా చిన్నప్పటి నుంచి నూరి పోసింది .ఏడో తరగతి వరకు నన్ను ఎత్తుకొని ముద్దాడేది. నీ గురించే కాదు నీ చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచించమని చెబుతూ ఉండేది. ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. మా ట్రస్ట్ కార్య కలాపాలకు ప్రేరణ మా నాయనమ్మ .ఈ సేవలు మరింత విస్తృతంగా చేయాలని ఆలోచనతో ఉన్నాము.ఇందుకు తగ్గ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్ ఎప్పుడూ అండగా ఉంటుంది ఆయన తెలిపారు.  

ఒక స్కూల్లో, ఒక కాలేజీలో చదువు పూర్తి చేసుకొని బయటకు వచ్చాక, మళ్లీ ఆ స్కూల్ ,కాలేజీలో అడుగుపెట్టిన వారు ఎంతమంది ఉంటారు? మనం ప్రతిదీ ప్రభుత్వం నుంచి పొందాము. మరి మనం ప్రభుత్వం అందించిన ప్రయోజనాలను వినియోగించుకొని ఎదిగాము కదా.. మరి మనం ప్రభుత్వ పాఠశాలకు ఏం చేయగలుగుతున్నాము అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అంటారు నరేంద్ర కుమార్ కామరాజు .

తమ ట్రస్ట్ ను సంప్రదించాలి అనుకుంటే 7337252627 నెంబర్ కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. 



ఉచిత కోచింగ్ కు కేంద్రం శ్రీకారం

 పేద మధ్యతరగతి కుటుంబాలకు పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకోవడం అనేది పెద్ద భారంగా మారిందని,  ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను  కోచింగ్ తరగతులకు పంపకపోతే తాము గౌరవనీయమైన కుటుంబం  కాదని భావిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 

ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశానికి ఇచ్చిన సందేశంలో ప్రధాని మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని వారు కోచింగ్ కోసం ఖర్చు చేస్తున్న వేలాది కోట్ల రూపాయలను ఆదా చేయించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. మన యువత తమ కుటుంబాల దగ్గరే ఉండి వారి సంరక్షణ పొందాలి అదనపు ఆర్థిక భారం పడకూడదు కాబట్టి దేశ యువతకు వివిధ పోటీ పరీక్షల కోసం ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించాలని నిర్ణయించుకున్నామని ప్రధాని తెలిపారు. మన వద్ద ఉన్న అద్భుతమైన ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు, అందుబాటులో ఉన్న డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు కలిపి "దేశ యువతకు ఉచిత కోచింగ్ అందించే సమగ్ర వ్యవస్థను"  నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చర్య ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు ఆదా చేసుకోగలుగుతాయి. వారి పిల్లలు ఇంటి దగ్గరే ఉండే సిద్ధం కావచ్చు, తల్లిదండ్రులు వారిని సంరక్షించుకోవచ్చు అని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. 

వచ్చే ఏడాది లో ఒక కోటి మంది యువతకు ఏ ఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని సంకల్పం తీసుకున్నామని ,వారు ఏ ఐ ప్రపంచానికి నాయకత్వం వహించాలని ప్రధాని ఆకాంక్షించారు.

ఉచిత అన్నదాన భవనం@ బోధన్

 నిజామాబాద్ జిల్లా లోని బోధన్ పట్టణం లోని నర్సి రోడ్డు మారుతీ మందిరం వద్ద భక్తుల సౌకర్యార్థం " ఉచిత అన్న దాన భవనం" నిర్మాణం చేయడం అభినందనీయమని బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి గారు అన్నారు. 



శనివారం భవనంలో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం భవన నిర్మాణం చేపట్టిన కృష్ణ సైకిల్ స్టోర్స్ యజమాని వి. నరసింహ రావు గారి ని ఆలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గంగాధర్ రావు, శివాలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. 

దో ఘంటే దేశ్ కే నామ్.. ఢిల్లీ వైద్యుల ఉచిత సేవ

 దేశం కోసం రెండు గంటలు.. 2 ఘంటే దేశ్ కే నామ్.. అనే ఆరోగ్య సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములం అవుతామంటూ ఢిల్లీ వ్యాప్తంగా పలువురు వైద్య నిపుణులు ముందుకు వస్తున్నారు. 

పేద, నిరుపేద వర్గాలకు చెందిన రోగులకు ప్రతి వారం " 2 గంటల ఉచిత కన్సల్టేషన్ సేవలు " అందించనున్నట్లు శని వారం ప్రకటించారు.కార్డియాలజీ, ఎండో క్రైనాలజీ,పీడియాట్రిక్ ,గైనకాలజీ, జనరల్ మెడిసిన్ సహా ఇతర స్పెషలిస్టులు క్రమంగా దీంట్లో నమోదు చేసుకుంటున్నారు.

మారుమూల ప్రాంతాల్లోని రోగుల కోసం " వర్చువల్ కన్సల్టేషన్ స్లాట్" లను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పిల్లల ఆరోగ్యం నుంచి మానసిక ఆరోగ్యం వరకు .. వైద్య నిపుణుల సేవలు అందిస్తామని డాక్టర్ ఇకేదా తెలిపారు.

15, ఆగస్టు 2026, శనివారం

తెలుగు రాష్ట్రాల రైతులకు.. 3 రోజుల ఉచిత శిక్షణ

 జాతీయ స్థాయి సంస్థ అయిన ఎన్ ఐ పి హెచ్ ఎం పర్యావరణహితమైన సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై శాస్త్రవేత్తలతో పాటు రైతులకు కూడా శిక్షణ ఇస్తోంది. వర్మీ కంపోస్టులో ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రం సూడో మోనాస్ బ్యాక్టీరియా కలిపి సేంద్రీయ ఎరువు తయారు చేసుకోవడం.. పొటాష్, ఫాస్ఫేటులను మొక్కలకు అందుబాటులోకి తెచ్చే జీవన ఎరువులను , జీవ రసాయనాలను రైతు స్థాయిలో అభివృద్ధి చేసుకోవడం, మిత్ర పురుగుల సంతతిని పెంపొందించే చర్యలపై శిక్షణ ఇస్తారు. 

కనీసం 20 మంది రైతులు బృందంగా ఏర్పడి తమను 040-24015932 నంబరులో సంప్రదిస్తే " 3 రోజుల పాటు శిక్షణ ఉచితంగా " ఇస్తామని ఎన్ఐపిహెచ్ఎం మొక్కల ఆరోగ్య నిర్వహణ విభాగం సంచాలకులు తెలిపారు. ఐతే భోజన ఖర్చులు రైతులే భరించాల్సి ఉంటుందని తెలిపారు. ఇటీవల గుంటూరు ప్రాంత రైతులకు మిరప, పొగాకు సాగు లో శిక్షణ ఇచ్చామన్నారు. 

కేరళ, తమిళ నాడు ల నుండి శాస్త్ర వేత్తలు, రైతులు అధిక సంఖ్యలో శిక్షణ పొందుతున్నారని అధికారి తెలిపారు.తెలుగు రాష్ట్రాల రైతులు ఇట్టి ఉచిత శిక్షణ అవకాశాన్ని అధిక సంఖ్యలో ఉపయోగించుకుని లాభం పొందాలని కోరారు.

ఉచితంగా.. దంత వైద్య సేవలు..

 ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు అని అంటారు.. అయిన వారికి దూరమై, ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న పిల్లలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మేమున్నాం అంటూ " లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్" సంస్థ భరోసా ఇస్తోంది. 

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్, ఐ కే ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోయిన్ పల్లి , బాపూజీ నగర్ లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో " ఉచిత దంత వైద్య సేవలు" అందుబాటులోకి తెచ్చింది. 

ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్ సభ్యులు ఆర్. నారాయణ, ఆర్గొండ నర్సింలు, బచ్చు లక్ష్మణ్, కే. లింగయ్య లు అతిథులుగా హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 180 మందికి సేవలు అందించినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని వారు తెలిపారు. 

14, ఆగస్టు 2026, శుక్రవారం

మెడి కవర్ ఆసుపత్రిలో ప్రతినెలా ఫ్రీ క్యాన్సర్ క్యాంప్

క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సతో వ్యాధి నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుందని హైదరాబాద్ మెడి కవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆంకాలజిస్టులు సూచించారు.

 కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ లో "ప్రతి నెల రెండో గురువారం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని"  నిర్వహించనున్నట్లు మెడికవర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డాక్టర్లు.. డాక్టర్ అన్వేష్, డాక్టర్ నీలేష్ ,డాక్టర్ స్నేహ తెలిపారు. గురువారం హాస్పిటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్లతో కలిసి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ పాల్గొని మాట్లాడారు. 

కరీంనగర్ మెడి కవర్ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన మొదటి ఉచిత క్యాన్సర్ శిబిరంలో 186 మందికి పరీక్షలు చేయగా అందులో 26 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. క్యాన్సర్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇకపై" ప్రతినెలా రెండో గురువారం"  కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో" ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని "నిర్వహించాలని నిర్ణయించినట్లు డాక్టర్లు తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి అన్నారు. హాస్పిటల్ లో కల్పించిన ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ముందస్తు ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో వైద్యులు మాట్లాడుతూ కరీంనగర్లో ముఖ్యంగా "బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అధికంగా " నమోదు అవుతున్నాయని తెలిపారు. మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తుందన్నారు. అయితే క్యాన్సర్ లక్షణాలు స్పష్టంగా బయటపడకముందే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని తొలి దశలో గుర్తించి తగిన చికిత్స అందించవచ్చు  అన్నారు.

 క్యాన్సర్ బారిన పడకుండా కొంతమంది నైనా కాపాడాలనే ఉద్దేశంతో మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం" ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలని " నిర్వహిస్తోందని వైద్యులు తెలిపారు. ముందస్తు గుర్తింపు, సరైన సమయంలో చికిత్స, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా క్యాన్సర్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.

మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ సంపత్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, పిఆర్ అబ్దుల్ వకీల్ తదితరులు పాల్గొన్నారు. 



ఉచిత చేనేత శిక్షణ @ దోమకొండ

 దోమకొండలో చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకు రావడానికి దోమకొండ గడికోట ట్రస్ట్ వారి సహకారంతో "ఉచిత చేనేత శిక్షణ తరగతులు"నిర్వహిస్తున్నట్లు హైద్రాబాద్ చేనేత సేవా సంస్థ ప్రతినిధులు పవన్, సంతోష్ లు తెలిపారు. 

గురువారం దోమకొండ మండల కేంద్రంలోని ఉమా బాగ్ లో చేనేత శిక్షణ తరగతులు ప్రారంభించి ,మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఐరేని నర్సయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బత్తిని సిద్ధరాములు, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, గడికోట ట్రస్ట్ సీనియర్ మేనేజర్ బాబ్జీ, ప్రతినిధులు పాల్గొన్నారు. 

పోలీస్ అభ్యర్థినులకు .. ఉచిత శిక్షణ

 రెండు దశాబ్దాలుగా ఉచిత సేవలు..అభయ ఫౌండేషన్

పోలీసు ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న నిరుపేద మహిళా అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అభయ ఫౌండేషన్ గురువారం నాడు ప్రకటించింది. 100 రోజుల పాటు జరిగే ఈ ఉచిత శిక్షణ కార్యక్రమంలో అభ్యర్థులకు "ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయం కూడా" కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఇబ్రహీం పట్నం లోని అభయ ఆనంద నిలయంలో జరిగే ఈ ఉచిత శిక్షణ కార్య క్రమానికి "రీగల్ రెక్స్ నార్డ్, వీ ఎం ఆర్ లాజిస్టిక్స్ సంస్థలు సహకరిస్తున్నట్లు ఫౌండేషన్ పేర్కొంది. 

సీనియర్ ఇన్స్పెక్టర్ పీ. జగదీశ్వర్ పర్యవేక్షణలో ఇది జరగనుంది. అభ్యర్థినులను ఎంపిక చేయడానికి ఆదివారం రాష్ట్రంలోని 12 కేంద్రాల్లో అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. హైద్రాబాద్ లోని దిల్ సుఖ్ నగర్, అశోక్ నగర్ లతో పాటు మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ముల్కనూర్, ఖమ్మం, నిజామాబాద్, నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్, సిద్ధి పేట, సంగారెడ్డి లలో అర్హతా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 

మరిన్ని సమగ్ర వివరాలకు 9963002727,9959220450,7032813578 నంబర్ లలో సంప్రదించాలని అభయ ఫౌండేషన్ కోరింది. గత రెండు దశాబ్దాలుగా ఈ తరహా సేవలు అందిస్తున్నామని నిర్వాహకులు వివరించారు.

13, ఆగస్టు 2026, గురువారం

వాట్సాప్ లో hi.. రూ 5 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్

 భారత దేశం లోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆసుపత్రి ఖర్చుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన పథకం" ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన PM JAY. ఈ పథకం ద్వారా అర్హులైన పేద మధ్య తరగతి కుటుంబాలకు సంవత్సరానికి రూ 5 లక్షల వరకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా నగదు రహిత వైద్య చికిత్స అందుతుంది. 

ఫ్రీ గా ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స పొందేందుకు ఈ ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ అత్యంత కీలకం. ఈ హెల్త్ కార్డ్ పొందడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లో నుండే మీ మొబైల్ ఫోన్ లోని అధికారిక వాట్సప్ చాట్ బాట్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్రభుత్వ అధికారిక ఆయుష్మాన్ సారధి వాట్సాప్ నంబర్  +91 72908 23838 కు " hi" లేదా" hello" అని మెసేజ్ పంపి ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చు. చాట్ బాట్ సూచనల ప్రకారం మై ఆయుష్మాన్ కార్డ్ ఆప్షన్ ను ఎంచుకుని , ఈ- కే వై సి పూర్తి చేసి నేరుగా కార్డు ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

వాట్సాప్ తో పాటు ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అధికారిక వెబ్ సైట్ అయిన beneficiary.nha.gov.in ను సందర్శించి మొబైల్ నెంబర్, OTP ద్వారా లాగ్ ఇన్ కావాలి. అడిగిన వివరాలు ఎంటర్ చేసి మీ పేరు, గుర్తింపు నంబర్ ఆధారంగా వివరాలు సెర్చ్ చేసి , ఫోటో అప్ లోడ్ చేసి అవసరమైన వివరాలు సబ్మిట్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. 

ఈ పథకం కింద ఎలాంటి ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా 70 సంవత్సరాలు నిండిన వృద్ధులందరూ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ పొందేందుకు అర్హులే. వీరితో పాటు 2011 సామాజిక ఆర్థిక కుల గణన SECC డేటా ఆధారంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల లోని ఆర్థికంగా వెనుకబడిన అనేక కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సులభ విధానాన్ని అనుసరించి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పొందవచ్చు. 

ఉచిత కుట్టు మిషన్ లు.. బీసీ మహిళలకు

 బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించే లక్ష్యంతో కీలక స్కీంకు శ్రీకారం చుడుతున్నారు ప్రభుత్వ అధికారులు.  కుట్టు వృత్తిపై ఆసక్తి, నైపుణ్యమున్న పేద ,నిరుద్యోగ, బిసి మహిళలకు 100% ప్రభుత్వ సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టుమషన్లను ఉచితంగా అందజేయనున్నారు.

 రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 1,19000 ఆటోమేటిక్ కుట్టుమిషన్లను బీసీ మహిళలకు అందిస్తున్నారు. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో కుట్టుమిషన్లను అందజేయడం ఈ స్కీం యొక్క ఉద్దేశం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కుట్టవృత్తిపై నైపుణ్యం ఉన్న మహిళలకు ఆధునిక ఆటోమేటిక్ కుట్టుమిషన్లు అందించడం ద్వారా ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మహిళల ఆదాయాన్ని పెంచి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆదాయాన్ని అర్జించే స్వయం ఉపాధి మహిళలుగా, భవిష్యత్తు మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. పథకం విధివిధానాలు ,కేటాయించిన బడ్జెట్, లబ్ధిదారుల ఎంపిక, అర్హతలు ,దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తాము వెల్లడించారు. 



ఒక్కో కుట్టు మిషన్ విలువ 12,000 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు.దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 15 తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన బీసీ మహిళలు నిర్ణీత గడువులో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులను ఎంపిక చేసి దశల వారీగా కుట్టు మిషన్ లు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. . 

నిరుపేదలు,వితంతువులు, ఒంటరి మహిళలు,నిరాశ్రయులు,అనాథలు,దివ్యాంగులు, కుట్టు వృత్తి లో అనుభవం ఉన్న మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.

ఎంపిక ఇలా.. మండల స్థాయి కమిటీకి ఎం పీ డీ ఓ, మున్సిపల్ కమిషనర్ లేదా జోనల్ కమిషనర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ ల ప్రతినిధులు , కలెక్టర్ నామినేట్ చేసిన వ్యక్తి , డీ ఆర్ డీ ఏ ప్రతినిథి తో కలిపి మొత్తం ఏడుగురు సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో పదిమంది అధికారులు సభ్యులుగా ఉంటారు. కలెక్టర్ ఆమోదించిన అర్హుల జాబితాను బీసీ సహకార సంస్థ ఎండి ఆమోదించిన అనంతరం కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. కుట్టు మిషన్ల కొనుగోలు ప్రక్రియను కేంద్రీకృత టెండరింగ్ విధానంలో చేపట్టనున్నారు. 

అర్హతలు ఈ విధంగా ఉన్నాయి.. బీసీ నిరుద్యోగ మహిళ అయి ఉండాలి, 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉండాలి, గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం ఒకటిన్నర లక్షల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయలకు మించ కూడదు. ఒక కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తారు .అర్హులు  https://tgobmms.chg.gov.in  వెబ్ పోర్టల్ ద్వారా మీ సేవ లేదా ఏదైనా ఆన్ లైన్ కేంద్రం ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత కమ్యూనిటీకి నిబంధనల మేరకు ప్రాధాన్యముంటుంది. 


11, ఆగస్టు 2026, మంగళవారం

వెటివర్ ఫౌండేషన్..రైతులకు ఉచిత శిక్షణ

 వట్టి వేరు వేర్లు నేల కోతను 90% వరకు తగ్గిస్తాయి. వాన నీరు 60%వరకు భూమిలోకి ఇంకుతుంది. రైతుల్లో అవగాహన పెంచేందుకు వెటివర్ ఫౌండేషన్ వేలాది మంది రైతులకు క్షేత్ర స్థాయిలో " ఉచిత ప్రాక్టికల్ శిక్షణ" ఇస్తోంది. ఒక ఎకరం పొలంలో గట్లవెంట నాటేందుకు సుమారు 2,000-3,000 వ్యాధి రహిత పిలకలు అవసరమవుతాయి. నాణ్యమైన వట్టి వేరు పిలకలను కూడా ఫౌండేషన్ రైతులకు పంపిణీ చేస్తోంది. 

వట్టివేరుపై సమగ్ర శిక్షణ ఇస్తాం..

అనేక ఔషధ,సుగంధ పంటలతో పాటు వట్టి వేరు పంట సాగు పద్ధతులు , అనువైన నేలలు,ప్రాసెసింగ్ పద్ధతులు వాణిజ్య అవకాశాలు తదితర అంశాలపై రైతులకు హైద్రాబాద్ బోడుప్పల్ లోని కార్యాలయంలో అప్పుడప్పుడు శాస్త్రీయంగా,సమగ్ర శిక్షణ ఇస్తున్నామని సైంటిస్ట్ కిరణ్ బాబు తెలిపారు.నాణ్యమైన వట్టి వేరు పిలకలను కూడా రైతులకు అందుబాటులోకి తెస్తున్నామని ఆయన పేర్కొన్నారు.



ఆసక్తి గల రైతులు సంప్రదించాలని ఆయన సూచించారు. 

డా. జీడీ కిరణ్ బాబు, సైంటిస్ట్ ఇంచార్జ్ , కేంద్రీయ ఔషధ , సుగంధ మొక్కల పరిశోధనా సంస్థ ( సీ ఎస్ ఐ ఆర్ సీమాప్),బోడుప్పల్ , హైద్రాబాద్ 

+91-40-27201131,27200272,

Email.. crchyd@cimap.res.in


ఉచితంగా HPV టీకాల పంపిణీ..

 గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్మూలన లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 14 ఏళ్ల కిశోర బాలికల కు" HPV టీకాను ఉచితంగా"  అందిస్తోంది. దేశంలోని అన్ని  జిల్లాల లోని అన్ని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో , పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ వేయనున్నట్లు అధికారులు తెలిపారు.

సరైన అవగాహన లేకుండా ఎంతో మంది స్త్రీలు కాన్సర్ బారిన పడి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారని, ఈ అకాల మరణాలను నివారించడానికి, భారత దేశం నుండి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ను తరిమి కొట్టడానికి , ఆరోగ్య భారతాన్ని నెలకొల్పడానికి " ఉచిత వాక్సినేషన్ " అద్భుత మార్గమని పేర్కొన్నారు.

కావున ప్రజలు విస్తృత ప్రచారం కల్పించి ,అవగాహన పెంచి " ఉచిత వాక్సినేషన్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఉచిత గుండె శస్త్ర చికిత్స @నిమ్స్, హైద్రాబాద్

 గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాదులోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్  సైన్సెస్ లో పూర్తిగా ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డా . రమణ దన్నపనేని , సాంకేతిక నిపుణుల బృందం సహకారంతో నిమ్స్ కార్డియో థోరాసిక్ సర్జరీ విభాగం అధిపతి ప్రొఫెసర్ అమరేశ్వర్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక శస్త్ర చికిత్సలు చేపట్టనున్నారని ఆయన తెలిపారు. ఈ నెల 13 నుంచి శస్త్ర చికిత్సలు ప్రారంభం కానున్నాయి. వాక్ ఇన్ విధానంలో చిన్నారులను పరీక్షించి , అవసరమైన వైద్య పరీక్షల అనంతరం సర్జరీ అవసరమున్న వారికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం , సీ ఎం ఆర్ ఎఫ్ ద్వారా ఉచితంగా చికిత్స అందించనున్నారు. ఐదేళ్లుగా ఏటా ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నిమ్స్ తన వార్షిక సోషల్ హెల్త్ ప్రోగ్రామ్ లో భాగంగా పిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలను అందించనుంది.పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న చిన్నారులకు పూర్తిగా ఉచితంగా ఆపరేషన్ లు చేయనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ తెలిపారు.

అర్హత గల చిన్నారుల తల్లి దండ్రులు సోమ వారం నుంచి శని వారం వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నిమ్స్ పాత బ్లాక్ మొదటి అంతస్తు లోని సీటీ సర్జరీ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.

ఎలాంటి ముందస్తు అపాయింట్ మెంట్ లేకుండానే చిన్నారులతో నిమ్స్ కు రావచ్చని తెలిపారు.

గతంలో చేయించిన వైద్య పరీక్షల రిపోర్టులు , సంబంధిత పత్రాలు ఉంటే వెంట తీసుకుని రావాలని, మరిన్ని సమగ్ర వివరాలకు 040-23489025 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్.. ఉచిత శిక్షణ

 గ్రామీణ ప్రాంత యువతి యువకులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకొని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంతోపాటు , సొంత కాళ్లపై నిలబడాలని ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ అన్నారు. సోమవారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకు అందించనున్న ఉచిత వృత్తి విద్యా, నైపుణ్య శిక్షణ కోర్సులకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతి యువకులకు "ఉచితంగా సాంకేతిక, వృత్తి నైపుణ్య శిక్షణ " అందిస్తూ వారిని ఉపాధి వైపు నడిపించేందుకు ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయమన్నారు. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు .

శిక్షణ కాలంలో  అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించడంతోపాటు యూనిఫారం, షూస్ ,బ్యాగ్ తదితర మెటీరియల్ ను ఉచితంగా అందజేస్తారని ఆయన తెలిపారు. కోర్స్ ను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ఎన్ ఎస్ డి సి గుర్తింపు పొందిన సర్టిఫికెట్ అందించడంతోపాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు .గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కోరారు. 

18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతి యువకులు శిక్షణకు అర్హులని ఆదిలాబాద్ జిల్లా కమ్యూనిటీ మొబిలైజర్ పసుల రమేష్ తెలిపారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన వారితో పాటు ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంఓఏ కంప్యూటర్ ట్రైనింగ్, సోలార్ టెక్నీషియన్, ఆటోమోటివ్- టూ వీలర్, ఫోర్ వీలర్ మెకానిక్, హోటల్ మేనేజ్మెంట్ ,హాస్పిటాలిటీ, ఎలక్ట్రికల్ అండ్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, హెల్త్ కేర్- జి డి ఏ, నర్సింగ్ అసిస్టెంట్, బ్యూటీ అండ్ వెల్ నెస్ తదితర కోర్సులలో ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు ఆయన వివరించారు.

 మరిన్ని సమగ్ర వివరాలకు 63036 03145 మొబైల్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కమ్యూనిటీ మొబిలైజర్ పసుల రమేష్, తుక్కారెడ్డి రాజేందర్ రెడ్డి ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 



9, ఆగస్టు 2026, ఆదివారం

ఉచిత మధుమేహ చికిత్స@ డా. మోహన్స్ డైరెక్ట్

 మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు మాత్రమే పెరుగుతాయి.. అనుకుంటాము కానీ కాళ్లకు పుండ్లు , కంటి సమస్యలు ,మూత్రపిండాల సమస్యలు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఎదురవుతుంటాయి. అవగాహన ఉన్న వ్యక్తులు అయితే వాటన్నింటినీ గమనించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటారు. మరి పేదవాళ్లు, అవగాహన లేని వారు.. మధుమేహం గురించి సరిగా తెలియక, ఖరీదైన వైద్యం చేయించుకోలేక మరెన్నో సమస్యల బారిన పడుతుంటారు. అలాంటి వారికి ఉచిత మధుమేహ వైద్యాన్ని అందించేందుకు డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్ వారు " డైరెక్ట్" ను ప్రారంభించారు. 

షుగర్ రోగులు ఎక్కువగా వెళ్ళే ఆసుపత్రులలో డాక్టర్ మోహన్స్ ఆసుపత్రి ఒకటి. భారతదేశవ్యాప్తంగా 50 కి పైగా శాఖలు ఉన్న ఈ సెంటర్ కు వచ్చే రోగులలో పేదలూ ఉంటారు .అయితే వారు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే ఇక్కడ జీవితాంతం ఉచితంగా చికిత్స చేయించుకునే వీలు ఉంది. ఒకవేళ షుగర్ వ్యాధి ముదిరి కంటి ఆపరేషన్ తప్పనిసరి అయినా, ఫుట్ అల్సర్ కారణంగా పాదాలకు ఆపరేషన్ చేయాల్సి వచ్చినా అది కూడా ఫ్రీగానే నిర్వహిస్తారు ఇక్కడ. ఆరోగ్యం పైన కాస్త అవగాహన ఉన్నవారు లేదా మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారితో పోలిస్తే.. రోజు కూలీలు, పేదలు, గ్రామాల్లో ఉండే వారికి మధుమేహం గురించి పెద్దగా తెలియదు. ఒకవేళ ఆ లక్షణాలు కనిపించినా వైద్యం కోసం ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది కనుక నిర్లక్ష్యంగా ఉంటుంటారు, అలాంటివారికి మధుమేహ చికిత్సను ఉచితంగా అందించేందుకు" డాక్టర్ మోహన్స్"  2006 లో "డైరెక్ట్"  డయాబెటిస్ ఇంటర్నేషనల్ రీసర్చ్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించింది. మధుమేహం గురించి అవగాహన కల్పిస్తూనే పరీక్షలు చేయడం, చికిత్స అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు, కౌన్సిలింగ్ ఇలా అన్ని రకాల సేవలను ఆ రోగులకు జీవితాంతం అందిస్తుంది ఈ డైరెక్ట్.

మధుమేహం రెండు రకాలుగా ఉంటుంది. కొందరికి జన్మతః వస్తుంది. దానిని టైప్ వన్ డయాబెటిస్ అంటారు. మరొకటి టైప్ టు డయాబెటిస్ ..ఇది ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, వేళకు నిద్రపోకపోవడం, ఒత్తిడి తదితర కారణాలతో మొదలవుతుంది .రెండింటిలో టైప్ వన్ మధుమేహం చికిత్స కాస్త ఖర్చుతో కూడుకుంది. వారు జీవితాంతం ఇన్సులిన్ తీసుకుంటూ, నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. అదే టైప్ టు ని తీసుకుంటే వైద్యులు సూచించిన మందులు వాడుతూ, జీవనశైలిలో మార్పులు చేసుకుని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే ఈ రెండింటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కళ్ళతో పాటు మూత్రపిండాల పైన కూడా ప్రభావం పడుతుంది. కాళ్లకు దెబ్బ తగిలి చిన్న గాయమైనా పుండుగా మారి ఒక పట్టాన తగ్గక ఆపరేషన్ వరకు వెళ్లాల్సి రావచ్చు. పేదలకు, పల్లె ప్రజలకు ఇవన్నీ పెద్దగా తెలియవు కనుక" డైరెక్ట్ " మధుమేహం గురించి తెలియజేస్తూనే వారికి ఉచిత పరీక్షలను నిర్వహిస్తుంది. సమస్య ఉందని తేలితే మందులను లేదా ఇన్సులిన్ కిట్ ను అందిస్తుంది. షుగర్ లెవెల్స్ ను అంచనా వేసే గ్లూకోజ్ సెల్ఫ్ మానిటరింగ్ మిషన్ తో పాటు అవసరమైన వారికి ఇన్సులిన్ పంప్స్ ను ఇస్తారు. ఇప్పటివరకు తమిళనాడులోని కాంచీపురం లో ఐదు గ్రామాలు ,చూనంపేట్ చుట్టుపక్కల 14 గ్రామాలు కలిపి దాదాపు 15 వేల మంది మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఉచిత చికిత్సను అందించే ప్రయత్నం చేస్తోంది" డైరెక్ట్" . 

అదే సమయంలో టైప్ వన్ డయాబెటిస్ బారిన పడిన 600 మందికి పైగా బాల నేరస్తులకు ఉచిత ఇన్సులిన్ కిట్స్ పంపిణీ చేసింది. హైదరాబాదులోనూ టైప్ వన్ బాధితులను గుర్తించి ఇన్సులిన్ అందిస్తోంది .వీటితో పాటు  చికిత్స విషయంలో సందేహాలు ఉన్నవారు తరచు ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండా మొబైల్ టెలి మెడిసిన్ సేవలను ప్రారంభించింది. అంటే" డైరెక్ట్"  సిబ్బంది రోగులకు నిత్యం అందుబాటులో ఉంటారు. అదే సమయంలో ఆ నిర్వాహకులు స్థానిక స్వయం సహాయక బృందాలలోని మహిళలను, యువతను వాలంటీర్లుగా మార్చి వారి ద్వారా మధుమేహ బాధితులు తీసుకోవలసిన పోషకాహారం ,జీవన విధానంలో చేసుకోవలసిన మార్పుల పైన అవగాహన కల్పించేలా ప్రోత్సహిస్తున్నారు.

 మధుమేహానికి ఆర్థిక పరిస్థితులు అడ్డు రాకూడదన్న ఆలోచనతోనే డైరెక్ట్ ను ప్రారంభించాము, మధుమేహం కారణంగా కళ్ళూ లేదా పాదాలకు ఆపరేషన్లను ఆసుపత్రుల్లోనే ఉచితంగా చేస్తూ, వారు పూర్తిగా కోలుకునే వరకు మేము పర్యవేక్షిస్తాం అనే డాక్టర్ వి మోహన్ ఇందుకోసం డయాబెటాలజిస్టులు, నర్సులు, డైటీషియన్లు, టెక్నీషియన్లు, సర్జన్లు, కౌన్సిలర్లతో కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇక పేదల ఆరోగ్య పరిస్థితి, కుటుంబ వివరాలు, నెలసరి ఆదాయం వంటివన్నీ అంచనా వేశాకే ఉచిత చికిత్సను అందించే " డైరెక్ట్ "  టెలీ మెడిసిన్ తో పాటు తమిళనాడులోని డాక్టర్ మోహన్స్ ఆసుపత్రి లో "ఎం విశ్వనాథన్ ఫ్రీ డయాబెటిస్ క్లినిక్ " అనే పేరుతో ఒక క్లినిక్ ను ప్రారంభించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థతో కలిసి ఈ సేవలను అందిస్తున్న" డైరెక్ట్"  కర్ణాటక, కేరళ, ఒడిశా ,పుదుచ్చేరి.. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలో ఉచిత వైద్యాన్ని అందిస్తోంది. 



8, ఆగస్టు 2026, శనివారం

సాధారణ ప్రజలకు.. యూ పీ ఐ సేవలు ఉచితమే

 చిన్న వ్యాపారులు, సాధారణ ప్రజానీకం పై ఎలాంటి భారం పడదని , యూపీఐ చెల్లింపులు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రజల సందేహాలకు స్పష్టత ఇస్తూ.. చెల్లింపుల చట్టంలోని సెక్షన్ 10 ఏ ను సవరించి మర్చంట్ డిస్కౌంట్ రేట్ నిబంధనలకు చట్ట బద్ధత కల్పిస్తున్నామన్నారు. 

ఈ  ఎం డీ ఆర్ ఛార్జీలు కేవలం రూ 1.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపారులకు , అది కూడా రూ. 2000 పై బడిన లావాదేవీలపై 0.3% నుండి 0.5% వరకు మాత్రమే విధించే ఆలోచన ఉందని ఆమె తెలిపారు. 

అగ్నివీర్ ఉత్తీర్ణులకు "ఉచిత ఫిజికల్ కోచింగ్"

 తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో తాడ్వాయి మండలం తోపాటు కామారెడ్డి జిల్లా కు చెందిన అగ్నివీర్ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణులైన యువతకు ఫిజికల్ ట్రైనింగ్ కోసం అరుదైన అవకాశం కల్పిస్తున్నట్లు " సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ (ఎస్ వై ఎం ఎస్) కామారెడ్డి జిల్లా ఇంచార్జి, తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేమె రాజిరెడ్డి గారు తెలిపారు . అగ్నివీర్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి జరిగే ఫిజికల్ పరీక్షలకు మెరుగైన శిక్షణ పొందేందుకు ఎస్ వై ఎం ఎస్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ అందించ నున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 

హన్మకొండ లోని రామప్ప డిఫెన్స్ & జూనియర్ కళాశాల యాజమాన్యం , సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ చేస్తున్న సేవలను గుర్తించి ,తమ సంస్థ ద్వారా ఇప్పటివరకు 70 మంది అగ్నివీర్ ఉత్తీర్ణులకు" ఉచితంగా ఫిజికల్ కోచింగ్ " అందించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన యువత తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి 94942 60214 మొబైల్ నెంబర్ లో సంప్రదించాలని కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ శ్రీ దేమె రాజిరెడ్డి గారు పేర్కొన్నారు.

6, ఆగస్టు 2026, గురువారం

మైనారిటీ స్టడీ సర్కిల్ లో ఉచిత శిక్షణ లు

 తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అర్హులైన మైనారిటీ లకు వివిధ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

ప్రస్తుతం పోలీస్ శాఖ లోని వివిధ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు MD యాకూబ్ పాషా తెలిపారు. 

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల  చేశారు.SI పోస్టులకు 50 మంది, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 100 మందిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. 

పూర్తి సమగ్ర వివరాలకు..

85208 60785, 040-23236112, 90590 50062 నంబర్ లలో సంప్రదించాలని ఆయన సూచించారు. 

పేద పిల్లలకు ఉచిత విమాన యానం

 ఆకాశ యానం అందరికీ అందదు. ఆ అందని ఆకాశ ప్రయాణాన్ని పేద పిల్లలకు ఉచితంగా అందించేందుకు ఉత్తరాఖండ్ లో ఉన్న హల్ద్వానీ నగరంలోని పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ లోని విమానం బయలుదేరి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగింది. ఆదివారం జరిగిన ఈ విమాన ప్రయాణం లో 30 మందికి పైగా నిరుపేద కుటుంబాల పిల్లలు ప్రయాణించారు. ఆ పిల్లల కోసం విమాన టికెట్లను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు వ్లాగర్ సౌరభ్ జోషి, ఆయన సతీమణి అవంతికా భట్ లు బుక్ చేశారు. ఆ పిల్లల తో పాటు వారూ ప్రయాణించారు. నోయిడా లోని గేమింగ్ జోన్ లో పిల్లలను ఆడిస్తూ రోజంతా సరదాగా గడిపారు. 

రెస్టారెంట్ లో పిల్లలకు ఇష్టమైన పిజ్జాలు, బర్గర్ లు ఆర్డర్ చేశారు. ఆ పిల్లల సందడి, అల్లరి, సంతోషాలను వీడియో తీసి సౌరభ్ తన యూట్యూబ్ ఛానల్ లో పోస్టు చేశాడు. అవంతిక తన ఇన్స్టా గ్రామ్ హ్యాండిల్ లో పోస్టు చేసింది. 

పేద పిల్లల సంతోషం కోసం ఒక రోజు చేసిన ఖర్చు కన్నా వారి సంతోషం కోసం శ్రద్ధ చూపినందుకు సోషల్ మీడియాలో ఎంతో మంది అవంతిక జోడీ ని ప్రశంసించారు. కొన్ని నెలల క్రితం అవంతిక, సౌరభ్ లు విడిపోతున్నారని, అందుకే వారిద్దరూ వీడియోల్లో కనిపించడం లేదని పుకార్లు వచ్చాయి. ఆ పుకార్లకు తాజాగా వారి వీడియోలు సమాధానం ఇస్తున్నాయి. పురాతన కాలంలో పావురాలతో సందేశం పంపినట్లు, ఈ జోడీ వీడియో తో నెటిజన్ లకు సందేశం పంపింది .

పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ .. ఉచిత శిక్షణలు

 తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ తెలిపింది.

ప్రస్తుతం  ఎస్ ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు " ఉచిత శిక్షణ తో పాటు వసతి సౌకర్యం" కల్పించాలని పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ నిర్ణయించింది. 300 మంది అభ్యర్థులకు ప్రత్యక్షంగా .. మరో 300 మందికి ఆన్ లైన్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. లయన్స్ క్లబ్ మరియు రాంకీ గ్రూప్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ ప్రొ. లక్ష్మీ కుమారి తెలిపారు. 

 సెప్టెంబర్ 15 నుంచి మొదలయ్యే శిక్షణ ఎస్ ఐ మెయిన్స్ పరీక్షలు ముగిసే వరకు కొనసాగుతుంది.

ఆసక్తి గల అభ్యర్థులు 95424 33427 ఫోన్ నెంబర్ లేదా https://paravasthucreativefoundation.net వెబ్ సైట్ ను సందర్శించాల్సిందిగా కోరారు. 

5, ఆగస్టు 2026, బుధవారం

యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి

 తెలంగాణ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు కామారెడ్డి జోన్ కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతలో ఉపాధి పొందడానికి కావలసిన వివిధ నైపుణ్యాలను పెంపొందించడానికి సంస్థ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ఇందుకోసం 45 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇతర సమగ్ర వివరాలకు 63000 57052 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. 

ఉచిత భోజనం@శ్రీ బాలాజీ ఫ్యామిలీ రెస్టారెంట్, సీలేరు

 ఇప్పుడిప్పుడే పట్టణంగా ఎదుగుతున్న ఏజెన్సీ ప్రాంతం.. సీలేరు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఈ ఊరిలో హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు తూర్పు గోదావరి జిల్లా నుండి వచ్చింది నక్కా జ్ఞానేశ్వర రావు గారి కుటుంబం. మొదట్లో వ్యవసాయం చేసిన ఆయన, తర్వాత శ్రీ బాలాజీ ఫ్యామిలీ రెసిడెన్సీ అండ్ రెస్టారెంట్ ను పెట్టాడు. అప్పుడే అక్కడికి గర్భిణులు ఎక్కువగా రావడం గమనించాడు. వారందరూ మారుమూలన ఉన్న పర్వత ప్రాంతాల నుంచి సీలేరు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వచ్చే గిరిజనులు. ఐతే వారి దగ్గర భోజనానికి సరిపడా డబ్బు ఉండేది కాదు. తమ దగ్గర ఉన్నదేదో చేతిలో పెట్టి వెళ్ళి పోయే వారు. ఆయన కూడా ఇంతే ఇవ్వాలి అని పట్టు పట్టేవారు కాదు. పోనుపోను వారిని డబ్బులు అడగడమే మానేశాడు జ్ఞానేశ్వర రావు. అలా 2018 నుండి వారికి ఉచితంగానే భోజనం పెడుతున్నాడు ఆయన. 

కేవలం తన హోటల్ ను వెతుక్కుంటూ వచ్చే వారికి మాత్రమే కాకుండా , సీలేరు పీ హెచ్ సీ లో పని చేసే నర్సులకు రోజూ తన హోటల్ మీల్స్ టోకెన్లు ఇస్తున్నాడు. వారు దవాఖానకు వచ్చే గర్భిణులకు , వారి సహాయకులకు ఈ టోకెన్లు ఇచ్చి హోటల్ కు పంపిస్తున్నారు. అలా రోజూ కనీసం 20 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నాడు శ్రీ జ్ఞానేశ్వర రావు. 

ఇక్కడ ప్రతి నెలా 9 వ తేదీన గర్భిణులకు అన్ని రకాల టెస్టులు చేస్తుంటారు. ఆ సమయంలో వంద మంది కి పైగా వస్తుంటారు. ఆ రోజున తన భార్య నాగమణితో కలిసి హోటల్ నుండి తానే స్వయంగా భోజనం తీసుకెళ్లి ఇస్తుంటాడు ఆయన. 

ఉచిత విద్య@విద్యాఛాయ పాఠశాల@ సిలిగురి

 పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి పట్టణానికి చెందిన శక్తిపాల్ ది నిరుపేద కుటుంబం. అన్నం దొరకడమే కష్టమైన పరిస్థితుల్లో బాల కార్మికుడిగా మారాడు ఆయన. తర్వాత ఎంతో శ్రమించి సైన్యంలో చేరాడు. ప్రస్తుతం అస్సాం రైఫిల్స్ లో హవల్దార్ గా పని చేస్తున్నారు శ్రీ శక్తిపాల్. తన చిన్నప్పటి ఆకలి బాధలను మరచిపోలేదు శక్తిపాల్. తనకొచ్చే జీతంలో సగాన్ని వెచ్చించి రూ. 1 జనతా హోటల్ అనే పేరుతో సిలిగురిలో ఒక హోటల్ స్థాపించారు. 

ఇక్కడున్న ప్రభుత్వ ఆఫీసులకు,ఆసుపత్రులకు,ప్రయాణికులకు కడుపునిండా భోజనం పెడుతున్నాడు. మరి ఆ ఒక్క రూపాయి ఎందుకు అంటే..నేను నడిపే బడిలో వారిని ఏదో రకంగా భాగస్వాములను చేయాలి కదా అంటాడు.

విద్యా ఛాయ పేరుతో సిలిగురిలో ఒక పాఠశాలను నడుపుతున్నారు శక్తి పాల్ గారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే పేద వలస కార్మికుల పిల్లల సంక్షేమమే లక్ష్యంగా నడిచే ఈ బడిలో " ఉచితంగా చదువు " చెప్పడమే కాదు, రెండు పూటలా భోజనం పెడుతున్నాడు,ఉచితంగా బట్టలు,పుస్తకాలు అందిస్తున్నాడు శక్తి పాల్.ఇందుకోసం తన సంపాదనలో సగానికి పైగా వెచ్చిస్తున్నారు శక్తి పాల్..


బాలికలకు ఉచిత పైలట్ శిక్షణ

 తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు ఉచితంగా పైలట్ శిక్షణ ఇచ్చేందుకు ఇండిగో సంస్థ సీ ఎస్ ఆర్ విభాగం ఇండిగో రీచ్, ఇంటర్ విద్యా శాఖ ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఇంటర్ విద్యా శాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్, భారత్ కేర్స్ ట్రస్ట్ ప్రతినిధి సి. సాయి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఇండిగో రీచ్, భారత్ కేర్స్ సంస్థ లతో కలిసి అమలు చేస్తున్న " గివింగ్ వింగ్స్ టు ఫ్లై కార్యక్రమం " ద్వారా పైలట్ శిక్షణ ఇస్తారు. 20 నెలల పాటు కొనసాగే శిక్షణా కాలంలో కమర్షియల్ పైలట్ లైసెన్స్, ట్రైనింగ్ విత్ ఏ టీ ఆర్ టైప్ రేటింగ్, బస, భోజన వసతి, వైద్య బీమా, మెంటార్ షిప్, కెరీర్ మార్గదర్శక ఖర్చులను పూర్తిగా ఆయా సంస్థలే భరిస్తాయి. 

ఈ ఒప్పందంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అమ్మాయిలు తమ పైలట్ కావాలన్న కలను నిజం చేసుకోవచ్చని అభిలాష అభినవ్ అన్నారు.కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, వెబినార్లు నిర్వహిస్తారని తెలిపారు. అర్హులైన విద్యార్థినులు అధికారిక పోర్టల్ indigoreachgwf.scholarsbox.in ద్వారా దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఇంటర్ కళాశాలల నెట్వర్క్ ద్వారా ఈ సమాచారాన్ని విద్యార్థినులకు చేరువ చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

4, ఆగస్టు 2026, మంగళవారం

ఉచిత అన్న ప్రసాదం@ కడప కలెక్టరేట్

 అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసులలో జరిగినట్లుగానే కడప కలెక్టరేట్ లో కూడా ప్రతి సోమ వారం గ్రీవెన్స్ డే జరుగుతుంది. చుట్టు పక్కల ఊర్ల నుండి వందలాది మంది ప్రజలు వినతి పత్రాలు తీసుకుని వస్తుంటారు. పెన్షన్ దరఖాస్తుల కోసం, ఇతర సహాయాల కోసం, అర్జీలు పెట్టుకుని అధికారుల వంక ఆశగా చూస్తుంటారు. అందుకే దానిని అధికారికంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని పిలుస్తుంటారు. అక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో తెలియదు కానీ వచ్చిన వారి ఆకలి మాత్రం తీరుతుంది. అలా అర్జీలు పట్టుకుని అక్కడికి వచ్చే వారందరికీ కడుపు నిండా భోజనం పెడుతున్నారు శ్రీ సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు. గత 12 సంవత్సరాల నుంచి ఒక యజ్ఞం లా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు ఈ ఉచిత అన్నదానాన్ని శ్రీ సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు. రాయల సీమ లో తొలి ప్రైవేటు న్యాయ కళాశాలను స్థాపించిన వ్యక్తి ఆయన. 

1986 లో నాటి ముఖ్య మంత్రి శ్రీ ఎన్టీరామారావు గారి మీద అభిమానంతో బసవరామ తారకం న్యాయ కళాశాల అని పేరు పెట్టారు ఆయన. 2015 లో గోవర్ధన్ రెడ్డి గారు కడప కలెక్టరేట్ కు పని మీద వచ్చినప్పుడు , అర్జీలు పట్టుకుని మధ్యాహ్నం వరకు అధికారుల కోసం పడిగాపులు కాస్తూ ఆకలితో అలమటిస్తున్న ప్రజలను చూసారట ఆయన. ఈ దుస్థితిని తొలగించాలని నాటి నుంచి ఈ అన్న యజ్ఞాన్ని ప్రారంభించారు. దీని కోసం నెలకు దాదాపు 50 వేల రూపాయలు వరకు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

పోలీసు అధికారిగా పనిచేసిన తన తండ్రి ,తల్లితో కలిసి ప్రతి రోజూ కొంత మంది పేదవారికి   ఇంటి వద్ద అన్నం పెట్టేవారని , నేను దానిని కొనసాగిస్తున్నాను, అంతే అంటారు వినమ్రంగా శ్రీ సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు. 

విద్యార్థినులకు ఉచిత ఆటో ప్రయాణం

 ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు ఉచిత ప్రయాణం అని రాసి ఉన్న గులాబీ రంగు ఆటో చెన్నై లో అందరినీ ఆకర్షిస్తుంటుంది. చెన్నై లోని టీ నగర్, కోడంబాక్కం, అన్నా నగర్, పెరంబూర్ ప్రాంతాలలో గత కొన్ని సంవత్సరాలుగా తన ఆటోలో ఉచితంగా అమ్మాయిలను తీసుకు వెళుతోంది " రాజీ అశోక్" 




54 ఏళ్ల రాజీ అశోక్ ఆర్థిక సమస్యల కారణంగా కాలేజీ చదువును అర్ధాంతరంగా మానివేసింది. తన చదువు కొనసాగి ఉంటే జీవితం బాగుండేదని అనుకుంటూ ఉంటుంది. తనలాగే ఇతరులు చదువు మధ్యలో మానేయకుండా ఉండాలని తన వంతు సహాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రాజీ అశోక్. 

ప్రతి రోజూ విద్యార్థినులను బడిలో దింపి సాయంత్రం తిరిగి తీసుకు వస్తుంది రాజీ. రోజూ 10 నుంచి 15 మంది బాలికలకు సహాయం చేస్తుంది. ఇలా చేయడం అంటే తన సంపాదనలో ఎంతో కొంత వదులుకోవడమే. ఐతే అదేమీ తనకు ఇబ్బందిగా లేదు. స్కూల్, బస్ స్టాప్, ఆటో స్టాండ్ దగ్గర పిల్లల కోసం వేచి చూస్తాను. గులాబీ రంగు ఆటో ను గుర్తు పట్టి వెంటనే ఎక్కేసారు. నన్ను చూడగానే వారికి సంతోషంగా ఉంటుంది. సౌకర్యంగా కూర్చుంటారు. ఆకలి వేస్తే తినడానికి ఆటోలో బిస్కట్ ప్యాకెట్లు ఎప్పుడూ ఉంటాయి అంటుంది రాజీ అశోక్. 


ఎప్పుడో ఎక్కిన పిల్లలు సంతోషంగా పలకరించడం,వారి  తల్లిదండ్రులు ఆప్యాయంగా పలకరిస్తుంటే వెయ్యి ఏనుగుల బలం వస్తుంది, అంతులేని ఉత్సాహం వస్తుంది, ఇంకా ఏదైనా చేయాలని అనిపిస్తుంది అంటుంది రాజీ.

నేను రాజీ అక్క ఆటోలో ప్రయాణించాను అని ఎంతో మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు, వాటికి ప్రశంసలూ వస్తుంటాయి.. అవి నాకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంటాయి అన్నారు రాజీ.. 

వయసు 54 ఏళ్ళు కావడంతో స్వస్థలానికి తిరిగి వెళ్ళాలనిపించి ఇంటికి వెళ్ళిపోయారు రాజీ.మనసు మాత్రం చెన్నై ని వదలలేదు.. మళ్ళీ చెన్నై వచ్చేశారు. రాజీ భర్త ఒక సంస్థ ఇచ్చిన అంబులెన్స్ తో కేరళలో ఉచితంగా సేవ చేస్తుండడం, రాజీ కూడా చెన్నైలో తన వంతు సేవ చేస్తుండడం మనసుకేంతో ఆనందంగా ఉందంటారు రాజీ. చిన్న పాటి ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతుంటారు రాజీ. ఒక పెద్ద ఆటో ఉంటే మరింత మంది కి సేవ చేయగలుగుతాను అంటారు రాజీ. 


3, ఆగస్టు 2026, సోమవారం

జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ లో ఉచిత విద్య

 అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో వంద శాతం ఉచిత విద్య అందించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వంచరెడ్డి శ్రీకాంత్, వ్యాగ్మారే సుభాష్ లు కోరారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ ను కలిసి వినతి పత్రం అందచేశారు. జిల్లా సందర్శనకు వచ్చిన విద్యా శాఖ కార్యదర్శి శ్రీమతి యోగితా రాణా గారిని ప్రెస్ క్లబ్ కార్యవర్గం కలిసి ఉచిత విద్య అందించాలని వినతి పత్రం అందచేశారు. ప్రైవేట్ , కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్య కోసం తగు చర్యలు తీసుకోవాలని ఆమె డీఈఓ గారికి ఆదేశాలు జారీ చేశారు. డీఈఓ గారు స్పందిస్తూ ఇతర జిల్లాల్లో ని ప్రొసీడింగ్స్ పరిశీలించి నిజామాబాద్ జిల్లాలో కూడా ఉచిత విద్య అందించేలా త్వరలో చర్యలు చేపడతామని తెలిపారు. 

అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ లలో ఉచిత ప్రవేశం

 దేశంలో వృత్తిపరమైన శిక్షణ లో నాణ్యతను, ప్రయోజనాలను విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ ఫర్మేషన్ త్రూ ఐ టీ ఐ స్.. పీఎం సేతు పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ పథకానికి సంబంధించి సంగారెడ్డి క్లస్టర్ లో ఎల్లారెడ్డి ఏ టీ సీ ను ఎంపిక చేశారు. దీని ద్వారా ఈ కేంద్రంలో అత్యాధునిక యంత్రాలు, ఆటోమేషన్ పరికరాలు , డిజిటల్ ల్యాబ్ లు, ఆధునిక కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు అనుగుణంగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ దేశ వ్యాప్తంగా 1000 ఏ టీ సీ లను ఆధునీకరించనున్నది.

సంగారెడ్డి క్లస్టర్ లో ఎల్లారెడ్డి తో పాటు మెదక్, దుబ్బాక, హత్నూర్ ఏ టీ సీ లు ఉన్నాయి. వీటిని స్పోక్ ఏ టీ సీ లు గా అప్ గ్రేడ్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం, న్యూ ల్యాండ్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళుతోంది.

ఉచిత ప్రవేశం..

విద్యార్థులు ఈ కోర్సుల లో ప్రవేశం పొందేందుకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. శిక్షణా కాలంలో ప్రభుత్వం రూ.2 వేల చొప్పున స్టైఫండ్ లేదా స్కాలర్ షిప్ ఇస్తుంది. కోర్స్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి క్యాంపస్ సెలెక్షన్ ద్వారా పలు కార్పొరేట్ సంస్థల లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వంద శాతం ప్లేస్ మెంట్ సహాయం లభిస్తుందని భావిస్తున్నారు. ఆసక్తి గల వారు టీ జి ఐ టీ ఐ అడ్మిషన్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు హైద్రాబాద్ వంటి నగరాలకు వెళ్ళనవసరం లేకుండా సొంత జిల్లాలోనే ప్రపంచ స్థాయి నైపుణ్యాలను ఈ స్పోక్ ఏ టీ సీ ద్వారా ఉచితంగా పొంది మంచి ఉద్యోగాలు సాధించడానికి అవకాశాలు మెరుగవుతాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రతి సోమ, గురు వారాల్లో ఉచిత ఫిజియోథెరపీ

 దివ్యాంగులు ఉచిత ఫిజియోథెరపీ ని సద్వినియోగం చేసుకోవాలని బాల్కొండ మండలం విద్యాధికారి బట్టు రాజేశ్వర్ అన్నారు. తెలంగాణలోని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడిచే భవిత కేంద్రాలలో ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రతి సోమ, గురు వారాల్లో ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవిత కేంద్రాల్లో నిపుణులైన ఫిజియోథెరపీ వైద్యులచే ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. పిల్లలకు అవసరమైన వ్యాయామాలు నేర్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

దివ్యాంగులకు విద్యాభ్యాసంతో పాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఐ ఈ ఆర్ పీ లను నియమించినట్లు ఆయన తెలిపారు. దివ్యాంగులతో పాటు వారి వెంట వచ్చే మరొకరికి ప్రభుత్వం రవాణా ఖర్చులను సైతం చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రభుత్వం అవసరమైన,ఉపయోగకరమైన పరికరాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 

దోమకొండ గడికోట ట్రస్ట్ వారి ఉచిత సేవలు

 దోమకొండ గ్రామంలో బీడీ కార్మికులు, కూలీలు ఎక్కువగా ఉండడంతో వారి కుటుంబాలలో మెరుగైన ఆర్థిక పరిస్థితులు లేవు. అనారోగ్యంతో బాధ పడుతున్న వారిని వైద్యులకు చూపించలేని పరిస్థితిలో పలు కుటుంబాలు ఉండేవి. ఈ నేపథ్యంలో నిరుపేదలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో దోమకొండ గడికోట ట్రస్ట్, గ్రామ అభివృద్ధి సంస్థ కలిసి ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాయి. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనిమిదేళ్లుగా ఈ ఉచిత వైద్య సేవలు నిరంతరాయంగా అందుతున్నాయి. 

ట్రస్ట్ ఆధ్వర్యంలో 2017 లో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. అధిక సంఖ్యలో బాధితులు శిబిరానికి వచ్చారు. చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులతో పాటు బీపీ, షుగర్ వంటి వాటితో బాధ పడుతూ వైద్య పరీక్షలకు వెళ్లలేని దుస్థితిని ట్రస్ట్ ప్రతినిధులు గ్రహించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులను సర్వే నిర్వహించి గుర్తించారు. నిరుపేదలైన రోగులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, మందులు అందించాలని ట్రస్ట్ వారు సేవలందించడానికి  పూనుకున్నారు. 

జూలై 18,2018 నుంచి ప్రతి నెలా రోగులకు వైద్యులచే పరీక్షలు చేయిస్తూ, మందులను అందిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా ఈ సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. డయాబెటిస్ తో బాధ పడుతున్న ముగ్గురు విద్యార్థులకు సైతం ప్రతి నెలా సరిపోవు ఇంజక్షన్లు, మందులను అందిస్తూ వారి చదువులకు ఊతమిస్తున్నారు. 

అపోలో ఆసుపత్రి వారి సహకారంతో ఈ ఉచిత వైద్య సేవలు అందించడం , నిరుపేద కుటుంబాల్లో ఆత్మీయత,సంతోషం నెలకొనడం ఎంతో తృప్తిని ఇస్తుందని దోమకొండ గడికోట ట్రస్ట్ సీనియర్ మేనేజర్ బాబ్జీ గారు పేర్కొన్నారు.

125 రోజుల ఉచిత శిక్షణ / ఫౌండేషన్ కోర్స్

 తెలంగాణ రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిల్ ల ద్వారా  వివిధ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 125 రోజులపాటు ఇచ్చే ఉచిత కోచింగ్ కు  అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ ,ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల అభ్యర్థులు/ఈ బీ సీ,అనాధ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. గ్రూప్ వన్ ,గ్రూప్ టు, గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్ లతోపాటు పోలీస్ నియామక పరీక్షలు, బ్యాంకింగ్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్లు సమర్పించాలి. 

ఈ ఉచిత శిక్షణ కు ఎంపికైన వారి జాబితాను వారి డిగ్రీ మార్కుల ఆధారంగా ఆగస్టు 18 వ తేదీన విడుదల చేస్తారు. ధృవ పత్రాల పరిశీలన చేస్తారు. ఆగస్టు 25 వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.

అభ్యర్థి డిగ్రీ పాస్ అయి ఉండాలి,కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయలకు మించ రాదు. ప్రతి నెలా 75 శాతం ,అంతకంటే ఎక్కువ హాజరు ఉన్న అభ్యర్థులకు 5 నెలల పాటు నెలకు 1000 రూపాయలు పుస్తక నిధిగా రవాణా భత్యంతో కలిపి స్టయిఫండ్ గా చెల్లింపబడుతుంది.

రెగ్యులర్ కోర్సులు చదువుతున్న వారు, ఉద్యోగం చేస్తున్నవారు, గతంలో బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత కోచింగ్ పొందినవారు ఈ ఉచిత శిక్షణ కు అనర్హులు. 

అర్హులైన అభ్యర్థులు..

 www.tgbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు నెట్ ఫ్లిక్స్ ప్లాన్ ఉచితం

 ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మరియు ఓటీపీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తమ కస్టమర్ల కోసం జత కట్టాయి. ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులు ప్రతి నెలా 299 అంత కంటే ఎక్కువ విలువైన 4 ఆర్డర్ లను పూర్తి చేయడం ద్వారా నెట్ ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ను ఉచితంగా పొందవచ్చు. ఈ భాగస్వామ్యం ఫ్లిప్ కార్ట్, ఫ్లిప్ కార్ట్ గ్రోసరీ, ఫ్లిప్ కార్ట్ మినిట్స్ లో చేసే రోజు వారీ షాపింగ్ కు రివార్డ్ పాయింట్స్ అందిస్తుంది. దేశ ఈ కామర్స్ చరిత్ర లోనే మొదటి సారిగా ప్రపంచంలోనే టాప్ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ను రోజు వారీ షాపింగ్ ద్వారా పొందవచ్చు. ఈ ప్రయోజనం ఆగస్టు 1 నుండి అమలు లోకి వస్తుంది. ఫ్లిప్ కార్ట్ సభ్యులు ఒక క్యాలండర్ నెల లోపు 299 అంత కంటే ఎక్కువ విలువ ఉన్న 4 ఆర్డర్ లను పూర్తి చేయాల్సి ఉంటుంది. అర్హత కలిగిన 4 ఆర్డర్ లు పూర్తి అయిన తర్వాత నెట్ ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ను 30 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ యాప్ ద్వారానే ఈ ప్రయోజనాన్ని యాక్టివేట్ చేస్తారు. ప్రత్యేక లాగ్ ఇన్ అవసరం లేదు. 30 రోజుల తర్వాత ఈ ప్రయోజనం రీసెట్ అవుతుంది. ఇదే షాపింగ్ పద్ధతి ద్వారా దీన్ని మళ్ళీ పొందవచ్చు. 

ఫ్లిప్ కార్ట్ సభ్యులు కాని కస్టమర్ లు 12 నెలల లోపు 15 ఆర్డర్ లను పూర్తి చేసిన తర్వాత వెనువెంటనే అదనపు ప్రయోజనానికి ఆటోమేటిక్ గా అర్హత పొందుతారు. 

సాలార్జంగ్ మ్యూజియంలో ఫ్రీ ఎంట్రీ

 ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు హైదరాబాదులోని సాలార్జంగ్ మ్యూజియంలో ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ . ఈ మేరకు అన్ని జిల్లాల డిఈఓ లకు ఆదేశాలు జారీ చేశారు .విద్యార్థులకు మన దేశ సంస్కృతి, వారసత్వ సంపదపై అవగాహన కల్పించేందుకు ఈ విహారయాత్రలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ యాత్ర డిసెంబర్లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు .ప్రభుత్వ బడులతో పాటు ప్రైవేటు ,ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులు కూడా ఈ ఉచిత సందర్శన కు అర్హులు అని ఆయన తెలిపారు. 

ఉచిత ఆర్చరీ శిక్షణ @దోమకొండ

 ఆర్చరీ క్రీడల్లో జోరుగా పతకాలు సాధిస్తున్న క్రీడాకారులు... 

దోమకొండ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తూ కఠోర సాధన తో విజయాలు సాధిస్తున్నారు .వరుస విజయాలతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కఠోర సాధన, లక్ష్యంపై అచంచలమైన ఏకాగ్రతతో దోమకొండ ప్రాంతానికి చెందిన యువ ఆర్చర్లు జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభను ప్రదర్శిస్తూ పతకాలు సాధిస్తున్నారు .ఆర్చరీ ఆటకు దోమకొండ కేరాఫ్ అడ్రస్ గా మారింది. 

దోమకొండ గడికోట మైదానంలో సంస్థాన వారసులైన కామినేని అనిల్ కుమార్ 2007లో ఆర్చరీ అకాడమీ ఏర్పాటుచేసి విలువిద్యకు సంబంధించిన మెలకువలను అభ్యర్థులకు ఉచితంగా అందిస్తున్నారు. ఇక్కడి ఉచిత శిక్షణతో విలువిద్య క్రీడలో దోమకొండ విద్యార్థులు రాణిస్తున్నారు .పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆర్చరీ శిక్షకుడు ప్రతాప్ దాస్ శిక్షణలో మెలకువలు నేర్చుకొని రాష్ట్ర ,జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ పతకాలు సాధిస్తున్నారు. 

ఒకవైపు చదువుతూనే నిత్యం 4 గంటల సాధన చేస్తున్నారు. 19 ఏళ్లుగా ఇక్కడ ఎంతో మంది ఆర్చరీ లో రాణించి తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చారు. దోమకొండ తో పాటు బిక్నూర్ ,బీబీపేట ,మాచారెడ్డి మండలాలకు చెందిన పలు గ్రామాల విద్యార్థులతో పాటు కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు సైతం ఇక్కడికి వచ్చి విలువిద్య నేర్చుకుంటున్నారు. 

2007లో ఇక్కడ 40 మంది విద్యార్థులతో మొదలైన ఆర్చరీ శిక్షణ ప్రస్తుతం 550 మందికి చేరిందని ఆర్చరీ కోచ్ ప్రతాప్ దాస్ గారు తెలిపారు. కామినేని అనిల్ కుమార్ గారు ఉచితంగా సొంత డబ్బులతో ఆర్చరీ మెటీరియల్  అందించి వారికి పూర్తి శిక్షణ ఇప్పిస్తున్నారు. దోమకొండ, కాచాపూర్, పెద్ద మల్లారెడ్డి, బిబిపేట, ఫరీద్ పేట, పాల్వంచ, భిక్కనూరు, రామేశ్వర పల్లి, జంగంపల్లి, కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు విద్యార్థులు కొన్నేళ్లుగా ఇక్కడికి ఆర్చరీ శిక్షణ కోసం వస్తున్నారు. దీనితో ఆర్చరీ ఆట  అంటేనే దోమకొండ అనే విధంగా తయారయింది. 

దోమకొండకు చెందిన కదిరె సింధుజ పదేళ్ల నుంచి ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ ఇప్పటివరకు 38 సార్లు జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలలో పాల్గొన్నది. జాతీయస్థాయిలో రెండు సిల్వర్, రాష్ట్రస్థాయిలో ఓవరాల్ గా 44 బంగారు, ఐదు సిల్వర్ పతకాలు సాధించింది. ఒలింపిక్ పతకం సాధించడమే లక్ష్యంగా కఠోర సాధన చేస్తోంది.

భిక్కనూరుకు చెందిన నిరుపేద కూలి కుటుంబానికి చెందిన అనుదీప్ 8 ఏళ్లుగా ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ జైపూర్లో నిర్వహించిన జాతీయ  పోటీలలో సిల్వర్ మెడల్ సాధించాడు.

19 ఏళ్లుగా కోచ్ గా ప్రతాప్ దాసు గారు.. 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రతాప్ దాస్ గారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడారు. మొదట విజయవాడలో కోచ్ గా చేరారు. అనంతరం తనతో పాటు ఆర్చరీ ఆటలో పాల్గొన్న దోమకొండ గడికోట వారసులు కామినేని అనిల్ కుమార్ దోమకొండకు తీసుకు రావడంతో 19 ఏళ్లుగా ఇక్కడి విద్యార్థులకు కోచ్ గా ఉంటూ జాతీయ స్థాయిలో విద్యార్థులు పతకాలు సాధించేలా తీర్చిదిద్దారు. 

విలువిద్య శిక్షకుడు.. ప్రతాప్ దాస్..97051 41241

ఉచిత చేపలు, రొయ్యల పంపిణీ

 ఉచిత చేపలు రొయ్య పిల్లల పంపిణీ పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 116 కోట్ల రూపాయల అదనపు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలోని చెరువులు రిజర్వాయర్లు ఇతర జల వనరులలో భారీ ఎత్తున చేపలను రొయ్య పిల్లలను ఉచితంగా వదిలి ఎందుకు మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్ల చేస్తున్నారు. అతి త్వరగా టెండర్లు పిలిచి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయనున్నారు .అనంతరం జిల్లాల వారీగా చేపలు రొయ్య పిల్లలను సరఫరా చేసి చెరువులలో విడుదల చేయనున్నారు .ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వేలాది చెరువులు జలాశయాలు పూర్తిస్థాయిలో నీటితో నిండాయి. చేపల పెంపకానికి ఇదే సరైన సమయం అని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం వేగవంతం కానున్నది. 

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...