దేశంలో వృత్తిపరమైన శిక్షణ లో నాణ్యతను, ప్రయోజనాలను విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ ఫర్మేషన్ త్రూ ఐ టీ ఐ స్.. పీఎం సేతు పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ పథకానికి సంబంధించి సంగారెడ్డి క్లస్టర్ లో ఎల్లారెడ్డి ఏ టీ సీ ను ఎంపిక చేశారు. దీని ద్వారా ఈ కేంద్రంలో అత్యాధునిక యంత్రాలు, ఆటోమేషన్ పరికరాలు , డిజిటల్ ల్యాబ్ లు, ఆధునిక కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు అనుగుణంగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ దేశ వ్యాప్తంగా 1000 ఏ టీ సీ లను ఆధునీకరించనున్నది.
సంగారెడ్డి క్లస్టర్ లో ఎల్లారెడ్డి తో పాటు మెదక్, దుబ్బాక, హత్నూర్ ఏ టీ సీ లు ఉన్నాయి. వీటిని స్పోక్ ఏ టీ సీ లు గా అప్ గ్రేడ్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం, న్యూ ల్యాండ్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళుతోంది.
ఉచిత ప్రవేశం..
విద్యార్థులు ఈ కోర్సుల లో ప్రవేశం పొందేందుకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. శిక్షణా కాలంలో ప్రభుత్వం రూ.2 వేల చొప్పున స్టైఫండ్ లేదా స్కాలర్ షిప్ ఇస్తుంది. కోర్స్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి క్యాంపస్ సెలెక్షన్ ద్వారా పలు కార్పొరేట్ సంస్థల లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వంద శాతం ప్లేస్ మెంట్ సహాయం లభిస్తుందని భావిస్తున్నారు. ఆసక్తి గల వారు టీ జి ఐ టీ ఐ అడ్మిషన్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు హైద్రాబాద్ వంటి నగరాలకు వెళ్ళనవసరం లేకుండా సొంత జిల్లాలోనే ప్రపంచ స్థాయి నైపుణ్యాలను ఈ స్పోక్ ఏ టీ సీ ద్వారా ఉచితంగా పొంది మంచి ఉద్యోగాలు సాధించడానికి అవకాశాలు మెరుగవుతాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
.