వేలాది సైనికులకు లబ్ధి చేకూరే విధంగా భారత ప్రభుత్వం, అసాధారణ శౌర్యం ప్రదర్శించి గ్యాలంట్రీ అవార్డులు పొందిన సైనిక,నావికాదళ,వైమానిక దళ వీరులకు ఉచిత రైలు సౌకర్యం కల్పించింది..
జీవితాంతం ఉచిత రైలు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ రక్షణ శాఖ వెంటనే ఉత్తర్వులు జారీ చేసింది.వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ సౌకర్యం వర్తింప చేసింది..వారితో ఒక సహచరుడు కూడా ఈ సౌకర్యం పొందవచ్చు..
అవార్డు పొందిన వీరుడు మరణించినట్లయితే అతని భార్య లేదా భర్త.. మళ్ళీ పెళ్లి చేసుకునే వరకు ఈ సౌకర్యం పొందవచ్చు.
అవార్డు మరణానంతరం వచ్చినట్లయితే అతని తల్లి దండ్రులకు ఈ ప్రయోజనం కలుగుతుంది.
ఈ పథకం కింద లబ్ధిదారులు ఒక సహచరుడితో కలిసి జీవితాంతం ఇండియన్ రైల్వే లో ఉచితంగా ప్రయాణించవచ్చు.ఆయా రైళ్లలోని ఏసీ చైర్ కార్, ఫస్ట్ క్లాస్,సెకండ్ ఏసీ వంటి సౌకర్య వంతమైన తరగతులలో ప్రయాణించవచ్చు.
సైనికులకు గౌరవ ప్రదమైన ప్రయాణం కల్పించడమే ఈ పథకం లక్ష్యమని కేంద్రం తెలిపింది.ఇది వెంటనే అమల్లోకి వస్తుందని రక్షణ శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా వేలాది మంది సైనిక కుటుంబాలకు లబ్ధి కలగనుంది.
పరమ వీర చక్ర, మహా వీర చక్ర, వీర చక్ర,అశోక చక్ర, శౌర్య చక్ర వంటి పురస్కారాలు యుద్ధం, అత్యవసర పరిస్థితుల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి ప్రదానం చేస్తారు. గ్యాలంట్రీ అవార్డులు సైనికుల ధైర్యం,త్యాగాలకు ప్రతీకగా నిలుస్తాయి..