ఫ్రీ గవర్నమెంట్ సర్వీసెస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫ్రీ గవర్నమెంట్ సర్వీసెస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, ఆగస్టు 2026, మంగళవారం

రూ 1 కే.. ఫంక్షన్ హాల్..

 పేదలు, మధ్య తరగతి వర్గాల వారు శుభ కార్యాలు చేసుకోవడానికి రూపాయికే ఫంక్షన్ హాల్/ వేడుక వేదిక ను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. అంటే ప్రజలు దాదాపుగా ఉచితంగానే ఈ సౌకర్యం పొందుతారు అని చెప్పవచ్చు. 

ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఫంక్షన్ హాల్ ను ఆగస్టు 16 న మంత్రి నారాయణ గారు ప్రారంభించారు. అప్పుడే దీనిని ఒక రూపాయికి అద్దెకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. హాలు మొత్తం సెంట్రల్ ఏసీ, టైల్స్ తో కార్పొరేట్ స్థాయిలో నిర్మించారు. దీని సామర్థ్యం 5 వేలు కాగా, పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. ఎన్ క్యాప్ నిధులు రూ.25 లక్షలు, కార్పొరేషన్ కు చెందిన రూ.1.15 కోట్లు ఖర్చు చేశారు.

బస్సు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ @ తమిళనాడు

 తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అసెంబ్లీ వేదికగా సోమవారం నాడు పలు కీలక సంక్షేమ పథకాలను ప్రకటించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి" ఏడాదికి మూడు ఉచిత ఎల్పిజి సిలిండర్లు " అందించనున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ సూపర్ సిక్స్ పథకం కింద దీనిని అమలు చేస్తామని చెప్పారు .లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు నేరుగా జమ అయ్యేలా పథకాన్ని అమలు చేస్తామని ,వచ్చే ఏడాది పొంగల్ నుంచి ఈ పథకం అమలు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద ఒక కోటి 30 లక్షల కుటుంబాలకు లాభం చేకూరనున్నది.

 మహిళలు, ట్రాన్స్ జెండర్ ల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత విస్తరిస్తూ " వెట్రి పయన తిట్టం"  పథకాన్ని కూడా ఆయన ప్రకటించారు. ఈ పథకం ద్వారా ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించడంతో పాటు మహిళల కోసం దీని పరిధిని విస్తరించారు. ఇకపై ఎక్స్ప్రెస్ ,లిమిటెడ్ స్టాప్ సర్వీస్, డీలక్స్ బస్సులు, సబర్బన్, కొండ ప్రాంతాలలో నడిచే సాధారణ చార్జీల బస్సులోను మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఉచితంగా ప్రయాణం సాగించవచ్చు. ఈ పథకానికి ఎలాంటి ఆదాయ పరిమితి ,ప్రయాణాల సంఖ్య పై నిబంధనలు ఏమీ ఉండవని సీఎం స్పష్టం చేశారు. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నదని తెలిపారు. 

18, ఆగస్టు 2026, మంగళవారం

కృత్రిమ మేధ నుండి.. కుట్లు అల్లికల వరకు.. ఉచిత శిక్షణ

 నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ శాఖలతో పాటు , స్వచ్ఛంద సంస్థలు, గురుకులాలు, బ్యాంకులు, ఏ టి సి లు తదితర ఎన్నో సంస్థలలో యువతకు ఉపాధి అవకాశాలు పొందేందుకు, ఉద్యోగాలు పొందేందుకు , ఉన్నత విద్య లో ప్రవేశం పొందేందుకు .. ప్రవేశ పరీక్ష లకు " ఉచిత శిక్షణ లు " అందుబాటు లోనికి వచ్చాయి.. 

జీవితంలో ఎదగాలి,ఏదైనా సాధించాలి అనే తపన ఉన్న విద్యార్థులే కాకుండా నిరుద్యోగ యువత కు,మహిళలకు,కార్మికులకు ఇవి ఎంతో సహాయకారిగా ఉంటున్నాయి. చదువు పై శ్రద్ధ, నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఆసక్తి గలవారు ఉన్నత స్థాయి కి వెళ్లేందుకు ఈ ఉచిత శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయా సంస్థల నిర్వాహకులు పేర్కొంటారు..అలాంటి సంస్థల సంక్షిప్త వివరాలు ఇవి..

టాస్క్ లో నైపుణ్య అభివృద్ధి..

చదువుతో పాటు భవిష్యత్ లో ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి " టాస్క్" శిక్షణలు ఉపయోగపడతాయి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వివిధ కోర్సులు చదవొచ్చు. ప్రవేశాలకు ఈ నెల 31 వరకు గడువు ఉంది. కంప్యూటర్ కోడింగ్, లాంగ్వేజెస్, ఏ ఐ టూల్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. 

ప్రైవేట్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ముఖాముఖి, బృంద చర్చ నైపుణ్యాలు నేర్పుతారు.

పూర్తి సమగ్ర వివరాలకు 91542 52588 , 7013675052 జిల్లా మేనేజర్ రఘుతేజ్ ను సంప్రదించవచ్చు.

భవన నిర్మాణ రంగంలో..

కార్మిక సంక్షేమ శాఖ, న్యాక్ ఆధ్వర్యంలో ప్లంబింగ్,శానిటేషన్,పెయింటింగ్,డెకొరేషన్, తాపీ మేస్త్రి, ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్ పనులపై 15 రోజుల పాటు నైపుణ్యాలు నేర్పుతారు.

పూర్తి సమగ్ర వివరాలకు 98663 50200,99597 73079 నిజామాబాద్, 97045 87655 భీమ్ గల్.. ఫోన్ నెంబర్ లలో సంప్రదించాలని సూచిస్తున్నారు.. 

స్వయం ఉపాధి కోసం భరోసా..

డిచ్ పల్లిలోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో 19-45 ఏళ్ల వయసు గల గ్రామీణ మహిళలు ,యువతకు స్వయం ఉపాధి కోర్సులు నేర్పిస్తున్నారు.

మగ్గం వర్క్స్, హోం నీడ్స్ తయారీ,ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్,సర్వీస్,రిటైల్, కుట్టు మిషన్,కుట్లు అల్లికల లో నైపుణ్యం పొందవచ్చు.

పూర్తి సమగ్ర వివరాలకు..08461-222428 నంబరులో సంప్రదించాలి.

నైపుణ్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు పొందేందుకు..

పదో తరగతి పాసైన నిరుద్యోగ యువత కు వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవసరమైన శిక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము ను జిల్లాలోని 7  అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ( ఏ టీ సీ) లలో నేర్పిస్తున్నారు. 

ఇక్కడ అందించే కోర్సుల వివరాలు తెలుసుకునేందుకు నిజామాబాద్ లోని ప్రభుత్వ ఐటిఐ లో గానీ,94417 07536 నంబరును గానీ సంప్రదించవచ్చు. 

నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలకు..

నీట్, జేఈఈ మెయిన్స్ ఉన్నత విద్య పోటీ పరీక్షలకు ప్రైవేటులో శిక్షణ కు భారీగా ఖర్చు అవుతుంది.అందుకే జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, కేజీబీవీ సీ వో ఈ లలో వంద మంది విద్యార్థుల చొప్పున ఉచిత శిక్షణ ఇస్తున్నాయి.ఇటీవలే ఇంటర్ పాసైన వారికి లాంగ్ టర్మ్ శిక్షణ కు ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.సాంఘిక, బీసీ సంక్షేమ గురుకులాల ఆర్ సీ వో కార్యాలయాలలో సంప్రదించాలి.

బీసీ స్టడీ సర్కిల్ ఉచిత ఫౌండేషన్ శిక్షణ..

టీ జీ పీ ఎస్ సి గ్రూప్స్ తో పాటు బ్యాంకింగ్, ఆర్ ఆర్ బి , స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగార్థులకు .. నిజామాబాద్ లోని బీసీ స్టడీ సర్కిల్ లో 125 రోజులపాటు ఉచిత ఫౌండేషన్ శిక్షణ ఇస్తున్నారు . ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభ్యర్థులు అర్హులు.

పూర్తి సమగ్ర వివరాలకు 08462-241055 నంబరులో సంప్రదించాలి.

ఇవే కాకుండా వ్యవసాయ, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో " రైతు శిక్షణ", "పశు వైద్యం","పాల ఉత్పత్తి"  పై శిక్షణ లు అందుబాటు లో ఉన్నాయి. 

13, ఆగస్టు 2026, గురువారం

వాట్సాప్ లో hi.. రూ 5 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్

 భారత దేశం లోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆసుపత్రి ఖర్చుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన పథకం" ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన PM JAY. ఈ పథకం ద్వారా అర్హులైన పేద మధ్య తరగతి కుటుంబాలకు సంవత్సరానికి రూ 5 లక్షల వరకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా నగదు రహిత వైద్య చికిత్స అందుతుంది. 

ఫ్రీ గా ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స పొందేందుకు ఈ ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ అత్యంత కీలకం. ఈ హెల్త్ కార్డ్ పొందడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లో నుండే మీ మొబైల్ ఫోన్ లోని అధికారిక వాట్సప్ చాట్ బాట్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్రభుత్వ అధికారిక ఆయుష్మాన్ సారధి వాట్సాప్ నంబర్  +91 72908 23838 కు " hi" లేదా" hello" అని మెసేజ్ పంపి ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చు. చాట్ బాట్ సూచనల ప్రకారం మై ఆయుష్మాన్ కార్డ్ ఆప్షన్ ను ఎంచుకుని , ఈ- కే వై సి పూర్తి చేసి నేరుగా కార్డు ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

వాట్సాప్ తో పాటు ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అధికారిక వెబ్ సైట్ అయిన beneficiary.nha.gov.in ను సందర్శించి మొబైల్ నెంబర్, OTP ద్వారా లాగ్ ఇన్ కావాలి. అడిగిన వివరాలు ఎంటర్ చేసి మీ పేరు, గుర్తింపు నంబర్ ఆధారంగా వివరాలు సెర్చ్ చేసి , ఫోటో అప్ లోడ్ చేసి అవసరమైన వివరాలు సబ్మిట్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. 

ఈ పథకం కింద ఎలాంటి ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా 70 సంవత్సరాలు నిండిన వృద్ధులందరూ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ పొందేందుకు అర్హులే. వీరితో పాటు 2011 సామాజిక ఆర్థిక కుల గణన SECC డేటా ఆధారంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల లోని ఆర్థికంగా వెనుకబడిన అనేక కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సులభ విధానాన్ని అనుసరించి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పొందవచ్చు. 

ఉచిత కుట్టు మిషన్ లు.. బీసీ మహిళలకు

 బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించే లక్ష్యంతో కీలక స్కీంకు శ్రీకారం చుడుతున్నారు ప్రభుత్వ అధికారులు.  కుట్టు వృత్తిపై ఆసక్తి, నైపుణ్యమున్న పేద ,నిరుద్యోగ, బిసి మహిళలకు 100% ప్రభుత్వ సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టుమషన్లను ఉచితంగా అందజేయనున్నారు.

 రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 1,19000 ఆటోమేటిక్ కుట్టుమిషన్లను బీసీ మహిళలకు అందిస్తున్నారు. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో కుట్టుమిషన్లను అందజేయడం ఈ స్కీం యొక్క ఉద్దేశం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కుట్టవృత్తిపై నైపుణ్యం ఉన్న మహిళలకు ఆధునిక ఆటోమేటిక్ కుట్టుమిషన్లు అందించడం ద్వారా ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మహిళల ఆదాయాన్ని పెంచి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆదాయాన్ని అర్జించే స్వయం ఉపాధి మహిళలుగా, భవిష్యత్తు మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. పథకం విధివిధానాలు ,కేటాయించిన బడ్జెట్, లబ్ధిదారుల ఎంపిక, అర్హతలు ,దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తాము వెల్లడించారు. 



ఒక్కో కుట్టు మిషన్ విలువ 12,000 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు.దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 15 తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన బీసీ మహిళలు నిర్ణీత గడువులో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులను ఎంపిక చేసి దశల వారీగా కుట్టు మిషన్ లు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. . 

నిరుపేదలు,వితంతువులు, ఒంటరి మహిళలు,నిరాశ్రయులు,అనాథలు,దివ్యాంగులు, కుట్టు వృత్తి లో అనుభవం ఉన్న మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.

ఎంపిక ఇలా.. మండల స్థాయి కమిటీకి ఎం పీ డీ ఓ, మున్సిపల్ కమిషనర్ లేదా జోనల్ కమిషనర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ ల ప్రతినిధులు , కలెక్టర్ నామినేట్ చేసిన వ్యక్తి , డీ ఆర్ డీ ఏ ప్రతినిథి తో కలిపి మొత్తం ఏడుగురు సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో పదిమంది అధికారులు సభ్యులుగా ఉంటారు. కలెక్టర్ ఆమోదించిన అర్హుల జాబితాను బీసీ సహకార సంస్థ ఎండి ఆమోదించిన అనంతరం కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. కుట్టు మిషన్ల కొనుగోలు ప్రక్రియను కేంద్రీకృత టెండరింగ్ విధానంలో చేపట్టనున్నారు. 

అర్హతలు ఈ విధంగా ఉన్నాయి.. బీసీ నిరుద్యోగ మహిళ అయి ఉండాలి, 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉండాలి, గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం ఒకటిన్నర లక్షల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయలకు మించ కూడదు. ఒక కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తారు .అర్హులు  https://tgobmms.chg.gov.in  వెబ్ పోర్టల్ ద్వారా మీ సేవ లేదా ఏదైనా ఆన్ లైన్ కేంద్రం ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత కమ్యూనిటీకి నిబంధనల మేరకు ప్రాధాన్యముంటుంది. 


8, ఆగస్టు 2026, శనివారం

సాధారణ ప్రజలకు.. యూ పీ ఐ సేవలు ఉచితమే

 చిన్న వ్యాపారులు, సాధారణ ప్రజానీకం పై ఎలాంటి భారం పడదని , యూపీఐ చెల్లింపులు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రజల సందేహాలకు స్పష్టత ఇస్తూ.. చెల్లింపుల చట్టంలోని సెక్షన్ 10 ఏ ను సవరించి మర్చంట్ డిస్కౌంట్ రేట్ నిబంధనలకు చట్ట బద్ధత కల్పిస్తున్నామన్నారు. 

ఈ  ఎం డీ ఆర్ ఛార్జీలు కేవలం రూ 1.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపారులకు , అది కూడా రూ. 2000 పై బడిన లావాదేవీలపై 0.3% నుండి 0.5% వరకు మాత్రమే విధించే ఆలోచన ఉందని ఆమె తెలిపారు. 

5, ఆగస్టు 2026, బుధవారం

బాలికలకు ఉచిత పైలట్ శిక్షణ

 తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు ఉచితంగా పైలట్ శిక్షణ ఇచ్చేందుకు ఇండిగో సంస్థ సీ ఎస్ ఆర్ విభాగం ఇండిగో రీచ్, ఇంటర్ విద్యా శాఖ ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఇంటర్ విద్యా శాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్, భారత్ కేర్స్ ట్రస్ట్ ప్రతినిధి సి. సాయి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఇండిగో రీచ్, భారత్ కేర్స్ సంస్థ లతో కలిసి అమలు చేస్తున్న " గివింగ్ వింగ్స్ టు ఫ్లై కార్యక్రమం " ద్వారా పైలట్ శిక్షణ ఇస్తారు. 20 నెలల పాటు కొనసాగే శిక్షణా కాలంలో కమర్షియల్ పైలట్ లైసెన్స్, ట్రైనింగ్ విత్ ఏ టీ ఆర్ టైప్ రేటింగ్, బస, భోజన వసతి, వైద్య బీమా, మెంటార్ షిప్, కెరీర్ మార్గదర్శక ఖర్చులను పూర్తిగా ఆయా సంస్థలే భరిస్తాయి. 

ఈ ఒప్పందంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అమ్మాయిలు తమ పైలట్ కావాలన్న కలను నిజం చేసుకోవచ్చని అభిలాష అభినవ్ అన్నారు.కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, వెబినార్లు నిర్వహిస్తారని తెలిపారు. అర్హులైన విద్యార్థినులు అధికారిక పోర్టల్ indigoreachgwf.scholarsbox.in ద్వారా దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఇంటర్ కళాశాలల నెట్వర్క్ ద్వారా ఈ సమాచారాన్ని విద్యార్థినులకు చేరువ చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

3, ఆగస్టు 2026, సోమవారం

ప్రతి సోమ, గురు వారాల్లో ఉచిత ఫిజియోథెరపీ

 దివ్యాంగులు ఉచిత ఫిజియోథెరపీ ని సద్వినియోగం చేసుకోవాలని బాల్కొండ మండలం విద్యాధికారి బట్టు రాజేశ్వర్ అన్నారు. తెలంగాణలోని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడిచే భవిత కేంద్రాలలో ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రతి సోమ, గురు వారాల్లో ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవిత కేంద్రాల్లో నిపుణులైన ఫిజియోథెరపీ వైద్యులచే ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. పిల్లలకు అవసరమైన వ్యాయామాలు నేర్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

దివ్యాంగులకు విద్యాభ్యాసంతో పాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఐ ఈ ఆర్ పీ లను నియమించినట్లు ఆయన తెలిపారు. దివ్యాంగులతో పాటు వారి వెంట వచ్చే మరొకరికి ప్రభుత్వం రవాణా ఖర్చులను సైతం చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రభుత్వం అవసరమైన,ఉపయోగకరమైన పరికరాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 

125 రోజుల ఉచిత శిక్షణ / ఫౌండేషన్ కోర్స్

 తెలంగాణ రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిల్ ల ద్వారా  వివిధ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 125 రోజులపాటు ఇచ్చే ఉచిత కోచింగ్ కు  అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ ,ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల అభ్యర్థులు/ఈ బీ సీ,అనాధ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. గ్రూప్ వన్ ,గ్రూప్ టు, గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్ లతోపాటు పోలీస్ నియామక పరీక్షలు, బ్యాంకింగ్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్లు సమర్పించాలి. 

ఈ ఉచిత శిక్షణ కు ఎంపికైన వారి జాబితాను వారి డిగ్రీ మార్కుల ఆధారంగా ఆగస్టు 18 వ తేదీన విడుదల చేస్తారు. ధృవ పత్రాల పరిశీలన చేస్తారు. ఆగస్టు 25 వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.

అభ్యర్థి డిగ్రీ పాస్ అయి ఉండాలి,కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయలకు మించ రాదు. ప్రతి నెలా 75 శాతం ,అంతకంటే ఎక్కువ హాజరు ఉన్న అభ్యర్థులకు 5 నెలల పాటు నెలకు 1000 రూపాయలు పుస్తక నిధిగా రవాణా భత్యంతో కలిపి స్టయిఫండ్ గా చెల్లింపబడుతుంది.

రెగ్యులర్ కోర్సులు చదువుతున్న వారు, ఉద్యోగం చేస్తున్నవారు, గతంలో బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత కోచింగ్ పొందినవారు ఈ ఉచిత శిక్షణ కు అనర్హులు. 

అర్హులైన అభ్యర్థులు..

 www.tgbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

ఉచిత చేపలు, రొయ్యల పంపిణీ

 ఉచిత చేపలు రొయ్య పిల్లల పంపిణీ పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 116 కోట్ల రూపాయల అదనపు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలోని చెరువులు రిజర్వాయర్లు ఇతర జల వనరులలో భారీ ఎత్తున చేపలను రొయ్య పిల్లలను ఉచితంగా వదిలి ఎందుకు మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్ల చేస్తున్నారు. అతి త్వరగా టెండర్లు పిలిచి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయనున్నారు .అనంతరం జిల్లాల వారీగా చేపలు రొయ్య పిల్లలను సరఫరా చేసి చెరువులలో విడుదల చేయనున్నారు .ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వేలాది చెరువులు జలాశయాలు పూర్తిస్థాయిలో నీటితో నిండాయి. చేపల పెంపకానికి ఇదే సరైన సమయం అని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం వేగవంతం కానున్నది. 

25, జులై 2026, శనివారం

ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం

 44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి..


ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్ని కాపాడడం, పర్యావరణాన్ని రక్షించడం కోసం హైదరాబాద్ హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం నడుం బిగించింది. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఇందులో మూడు పండ్ల మొక్కలు, రెండు ఔషధ మొక్కలు లేదా అలంకరణ మొక్కలు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మొక్కలను పొందడం కోసం ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ మరియు మొబైల్ నెంబర్ సమర్పించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలోని 44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకువెళ్లాలని ప్రజలకు సూచించింది.

ఈ సంవత్సరం లక్ష కుటుంబాలకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ గోపిడి రోహిత్ తెలిపారు.

18, జులై 2026, శనివారం

ఉచితంగా.. న్యాయ సహాయం

 న్యాయ పరమైన సమస్యలు ఎదురైనప్పుడు ఎవరి సలహాలు,సూచనలు తీసుకోవాలో తెలియక చాలా మంది ఆందోళన చెందుతుంటారు. న్యాయ వాదులను సంపాదించాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు న్యాయ పరమైన సలహాలు,సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం " టెలీ లా"విధానాన్ని ప్రవేశ పెట్టింది. దీని ద్వారా ఎలాంటి ఫీజు చెల్లించకుండానే హైకోర్టు న్యాయ వాదుల నుంచి " ఉచితంగా న్యాయ సలహాలు, సూచనలు మాతృ భాష లోనే పొందే అవకాశం ఉంటుంది.

అపాయింట్ మెంట్.. 

దరఖాస్తుదారుడు ముందుగా ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ మీ సేవా, కామన్ సర్వీస్, డిజిటల్ సేవా కేంద్రాల్లో ఏదైనా ఒక దానిని సంప్రదించాలి. హైకోర్టు లాయర్ లతో మాట్లాడేందుకు నిర్వాహకులు ఉచితంగా అపాయింట్మెంట్ నమోదు చేస్తారు. అపాయింట్ మెంట్ ఇచ్చిన సమయానికే హై కోర్టు న్యాయవాది స్వయంగా దరఖాస్తుదారుడి ఫోన్ నెంబర్ కు కాల్ చేసి మాట్లాడతారు.

అందే సేవలు ఇవే..

వరకట్న వేధింపులు, లైంగిక నేరాలు, గృహ హింస,ఉపాధి,మహిళలు,పిల్లలు, వృద్ధుల మౌలిక హక్కులు, ప్రసూతి ప్రయోజనాలు, భూ తగాదాలు, వాహన చట్టాలు,FIR నమోదు, అరెస్ట్ చేసిన వ్యక్తిని నిర్బంధించడం, RTI, CAA, NRC, అట్రాసిటీ కేసులు, ఆస్తి గొడవలు, ప్రభుత్వ పథకాలు పొందడంలో అవరోధాలు తదితర సమస్యల గురించి న్యాయ వాదుల నుంచి "ఉచితంగా" సలహాలు,సూచనలు పొందవచ్చు.

27, మే 2026, బుధవారం

1.5 లక్షల ఉచిత చికిత్స..రోడ్డు ప్రమాద బాధితులకు

 ఆపదలో బాధితులకు భరోసా.. రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రహత్ పథకం కింద ఒకటిన్నర లక్షల రూపాయల ఉచిత చికిత్స.. కానీ సరైన ప్రచారం లేక బాధితులకు చేరువ కాని పథకం..

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో గాయపడిన బాధితులకు ఎలాంటి డబ్బులు డిపాజిట్ చేయకుండా తక్షణ వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రహత్ అంటే ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ అండ్ అశ్యురుడు ట్రీట్మెంట్ స్కీం.. పథకాన్ని అమలు చేస్తోంది. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రులలో చేర్పిస్తే చికిత్స ఖర్చులకు  ఎవరు డిపాజిట్ డబ్బులు కట్టాలని చాలామంది క్షతగాత్రులకు సహాయం చేయడానికి వెనుకంజ వేస్తుంటారు. బాధితులను ప్రభుత్వాసుపత్రులకు తరలిస్తే బాధ లేదు ,కానీ ప్రైవేట్ ఆస్పత్రులలో చేర్చాల్సి వస్తే వారి చికిత్స కోసం డబ్బులు కట్టి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఈ పథకాన్ని ప్రారంభించింది. 

ఈ పథకం కింద ప్రమాద బాధితులకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకటిన్నర లక్షల రూపాయల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఏడు రోజులపాటు చికిత్సకు ఈ పథకం ద్వారా సహాయం లభిస్తుంది. ప్రమాద బాధితులకు ప్రభుత్వ ఎం ప్యానెల్డ్/ ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఉన్న ఆసుపత్రులలో బాధితులు ముందుగా డబ్బులు చెల్లించకుండా చికిత్స పొందవచ్చు. ఈ ఆసుపత్రులలో బాధితుల చికిత్స కోసం అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. జాతీయ రహదారుల పైనే కాకుండా పట్టణ గ్రామీణ రహదారులపై జరిగిన ప్రమాదాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. బాధితులకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా ఎంతటి కోటీశ్వరులైన ఈ పథకం ద్వారా ఒకటిన్నర లక్షల వరకు నగదు రహిత చికిత్సను పొందవచ్చు..

ఇలా దరఖాస్తు చేసుకోవాలి.. ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా 112 హెల్ప్ లైన్ కు కాల్ చేసి సమీప ఆస్పత్రి వివరాలు ,అంబులెన్స్ సహాయం పొందవచ్చు.

ప్రమాదం వివరాలు తెలియగానే వాటిని ఈ-దార్ హోటల్ ద్వారా నమోదు చేస్తారు.

ఈ - దార్ పోర్టల్ అంటే..

ఈ - దార్ ( ఎలక్ట్రానిక్ డీటెయిల్డ్ ఆక్సిడెంట్ రిపోర్ట్ ) పోర్టల్ ద్వారా పోలీస్ ,వైద్య,రోడ్డు రవాణా శాఖ , బీమా సంస్థ లు అనుసంధానమై ఉండి ప్రమాద వివరాలను పంచుకుంటాయి.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే..

పోలీసులు ప్రమాద వివరాలు,డ్రైవర్,వాహనం వివరాలు నమోదు చేస్తారు.ప్రమాదం ఫోటోలు ,వీడియోలు పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు.

వైద్యులు దగ్గరిలోని ఆసుపత్రుల వివరాలు అందించి, ఆసుపత్రిలో బాధితులను చేర్పించాక , గాయాల సమాచారం నమోదు చేస్తారు.

రవాణా శాఖ ప్రమాదం వివరాలు తెలుపుతూ బీమా కంపెనీలకు సమాచారం ఇస్తారు. ఆసుపత్రులకు చికిత్స ఖర్చులు చెల్లించేలా చర్యలు చేపడతరు.

బీమా కంపెనీలు పరిహారం చెల్లించే ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తారు. 

సత్వర వైద్యం అందుబాటులోకి..

కేంద్ర ప్రభుత్వ పియం రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులు ప్రభుత్వ మరియు ఎంపానల్డ్ అంటే ఆరోగ్యశ్రీలో నమోదైన ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు కట్టకుండా 1.5 లక్షల వరకు చికిత్స పొందవచ్చు. ప్రమాదం జరగగానే వివరాలను ఈదార్ పోర్టల్ లో నమోదు చేస్తారు

ఈ పోర్టల్ లో వైద్య రవాణా పోలీసు శాఖలు అనుసంధానంగా ఉండడంతో సత్వర వైద్యము చికిత్స ఖర్చుల చెల్లింపు ఆసుపత్రులకు త్వరితగతిన జరుగుతాయి. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి, కామారెడ్డి జిల్లా.

ఈ పథకానికి సరైన ప్రచారం జరగడం లేదు..

ఈ పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 13 న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ గా వైద్యుల పరిభాషలో పిలువబడే ప్రమాదం జరిగిన మొదటి గంట సమయం లోపు ఎలాంటి ఖర్చు లేని వైద్య సహాయం అందించడం. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రాణాపాయం లేని స్థితిలో ఉంటే 24 గంటల వరకు, ప్రాణాపాయ స్థితిలో ఉంటే 48 గంటల వరకు ఈ పథకం ద్వారా " ఉచిత అత్యవసర వైద్యం " అందుతుంది.





24, మే 2026, ఆదివారం

ఆధార్ ఉచిత అప్ డేట్ గడువు పొడిగింపు

 భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI మై ఆధార్ పోర్టల్ లో ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్ డేట్ గడువు ను పొడిగించింది. ఆధార్ కార్డు దారులు ఇప్పుడు తమ గుర్తింపు,చిరునామా ఆధార పత్రాలను ఎలాంటి ఫీజు లేకుండా 2027 జూన్ 14 వరకు అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో తమ సమాచారాన్ని అప్డేట్ చేసుకుంటున్న ఆధార్ కార్డు దరుల నుంచి వస్తున్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో ఉంచుకొని ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.

ఆధార్ కార్డుదారులు కొత్త ఆధార్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఈ కొత్త యాప్ లో సురక్షితమైన ఆధార్ క్యూఆర్ ఆధారిత   ఆధార్ షేరింగ్, మెరుగైన ప్రైవసీ నియంత్రణలు, ఆధార్ సేవలకు సులభమైన యాక్సెస్ వంటి ఫీచర్లు ఉన్నాయని UIDAI వివరించింది. 

5-17 ఏళ్ల వారికి ఆధార్ సవరణ ఉచితం

 ఐదు నుంచి 17 ఏళ్ల వయసు గల వారికి మొదటిసారి ఆధార్ కార్డులో వివరాలను ఆధార్ కేంద్రాలలో సవరణ చేసుకుంటే ఎటువంటి రుసుము చెల్లించే అవసరం లేదని UIDAI హైదరాబాద్ రీజినల్ అధికారులు తెలిపారు.

ఐదేళ్లు నిండిన తర్వాత చేసే సవరణలో పిల్లల బయోమెట్రిక్, ఐరిస్ తీసుకుంటారని తెలిపారు. సాధారణంగా ఐదు నుంచి ఏడు ఏళ్లు మరియు 15 నుంచి 17 ఏళ్లు మధ్య వయసు గల వారికి మాత్రమే నమోదు కేంద్రాలలో మొదటిసారి వివరాల సవరణలను ఉచితంగా చేస్తారు .కానీ ఈసారి ఐదు నుంచి 17 ఏళ్ల వయసు గల వారందరికీ సెప్టెంబర్  30 వరకు ఉచితంగా సవరణ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఆధార్ కార్డులో చిరునామా తదితర వివరాలను ఆన్లైన్లో ఉచితంగా సవరించుకునే అవకాశం ఈ ఏడాది జూన్ 14 వరకు ఉండగా దీనిని మరొక ఏడాది పొడిగించినట్లు తెలిపారు.

29, మార్చి 2026, ఆదివారం

ఉచిత రైలు .. గ్యాలంట్రీ అవార్డీలకు..

 వేలాది సైనికులకు లబ్ధి చేకూరే విధంగా భారత ప్రభుత్వం, అసాధారణ శౌర్యం ప్రదర్శించి గ్యాలంట్రీ అవార్డులు పొందిన సైనిక,నావికాదళ,వైమానిక దళ వీరులకు ఉచిత రైలు సౌకర్యం కల్పించింది..

జీవితాంతం  ఉచిత రైలు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ  రక్షణ శాఖ వెంటనే ఉత్తర్వులు జారీ చేసింది.వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ సౌకర్యం వర్తింప చేసింది..వారితో ఒక సహచరుడు కూడా ఈ సౌకర్యం పొందవచ్చు..

అవార్డు పొందిన వీరుడు మరణించినట్లయితే అతని భార్య లేదా భర్త.. మళ్ళీ పెళ్లి చేసుకునే వరకు ఈ సౌకర్యం పొందవచ్చు.

అవార్డు మరణానంతరం వచ్చినట్లయితే అతని తల్లి దండ్రులకు ఈ ప్రయోజనం కలుగుతుంది.

ఈ పథకం కింద లబ్ధిదారులు ఒక సహచరుడితో కలిసి జీవితాంతం ఇండియన్ రైల్వే లో ఉచితంగా ప్రయాణించవచ్చు.ఆయా రైళ్లలోని ఏసీ చైర్ కార్, ఫస్ట్ క్లాస్,సెకండ్ ఏసీ  వంటి సౌకర్య వంతమైన తరగతులలో ప్రయాణించవచ్చు.

సైనికులకు గౌరవ ప్రదమైన ప్రయాణం కల్పించడమే ఈ పథకం లక్ష్యమని కేంద్రం తెలిపింది.ఇది వెంటనే అమల్లోకి వస్తుందని రక్షణ శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా వేలాది మంది సైనిక కుటుంబాలకు లబ్ధి కలగనుంది.

పరమ వీర చక్ర, మహా వీర చక్ర, వీర చక్ర,అశోక చక్ర, శౌర్య చక్ర వంటి పురస్కారాలు యుద్ధం, అత్యవసర పరిస్థితుల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి ప్రదానం చేస్తారు. గ్యాలంట్రీ అవార్డులు సైనికుల ధైర్యం,త్యాగాలకు ప్రతీకగా నిలుస్తాయి..

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...