విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత విమానం కోసం ఎదురు చూడడం కొందరికి బోర్ గ అనిపిస్తుంది. ఫోన్లో స్క్రోల్ చేస్తూ సమయం గడిపిన కొద్దిసేపటికి విసుగు వస్తుంది. అదే మంచి పుస్తకం చేతిలో ఉంటే.. చదవాలని ఉండి రోజువారి జీవితంలో సమయం దొరకని పుస్తకాన్ని ప్రశాంతంగా చదివే అవకాశం వస్తే, అంతకంటే ఆనందం మరొకటి ఉండదు అని చెప్పవచ్చు.
ఈ ఆలోచనతోనే కొన్ని విమానాశ్రయాలలో ఫ్లైబ్రరీలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఫ్లైబ్రరీ అంటే" విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఉచిత గ్రంథాలయం". విమానం కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు తమకు నచ్చిన పుస్తకాన్ని తీసుకొని చదవవచ్చు. విమానం వచ్చేసినా చదవడం పూర్తి కాకపోతే ఆ పుస్తకాన్ని వెంట తీసుకెళ్లి ప్రయాణంలో కూడా చదువుకోవచ్చు. అనంతరం వారు దిగిన విమానాశ్రయంలోని ఫ్లైబ్రరీలో దానిని ఇచ్చి వెళ్లిపోవచ్చు .
భువనేశ్వర్ లో మొదలైంది..
ఈ తరహా ప్రయోగానికి భువనేశ్వర్ లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదిక అయింది. 2025 లో "టేక్ ఏ బుక్ " అనే నినాదంతో లైబ్రరీని ప్రారంభించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయంలో ఇంగ్లీష్, హిందీ, ఒడియా భాషలలో సుమారు 600 పుస్తకాలు అందుబాటులో ఉంచారు. బాలల పుస్తకాలు, నవలలు, మేగజైన్లు తదితర విభాగాలకు చెందిన పుస్తకాలు కూడా ఇందులో ఉన్నాయి. డిపార్చర్ ,అరైవల్ ప్రాంతాలలో పుస్తకాల అరలని ఏర్పాటు చేశారు. ఇందులో పుస్తకాల నిర్వహణ ,అరలని సర్దడం వంటి పనులలో వాలంటీర్లు సహకరిస్తున్నారు. ఇక ఈ ఆలోచనకు ఇతర విమానాశ్రయాలలోనూ ఆదరణ లభిస్తోంది. తాజాగా ప్రయాగరాజ్ విమానాశ్రయంలోను ఫ్లైబ్రరీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాలను విరాళంగాను ఇవ్వవచ్చు .. ఈ ఫ్లైబ్రరీల ఏర్పాటు కేవలం సమయాన్ని సద్వినియోగం చేయాలని ఆలోచనతో రూపుదిద్దుకున్న కార్యక్రమం. ప్రయాణికుల మీద నమ్మకం, సమాజ భాగస్వామ్యం పై ఆధారపడి పని చేస్తుంది. పుస్తకాలను తీసుకున్న వారు తిరిగి ఇచ్చే విషయంలో స్వీయ బాధ్యతతో వ్యవహరించాలి. ఈ ఫ్లైబ్రరీల కోసం పుస్తకాలను విరాళంగా కూడా ఇవ్వవచ్చు అని నిర్వాహకులు కోరుతున్నారు.
