పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి పట్టణానికి చెందిన శక్తిపాల్ ది నిరుపేద కుటుంబం. అన్నం దొరకడమే కష్టమైన పరిస్థితుల్లో బాల కార్మికుడిగా మారాడు ఆయన. తర్వాత ఎంతో శ్రమించి సైన్యంలో చేరాడు. ప్రస్తుతం అస్సాం రైఫిల్స్ లో హవల్దార్ గా పని చేస్తున్నారు శ్రీ శక్తిపాల్. తన చిన్నప్పటి ఆకలి బాధలను మరచిపోలేదు శక్తిపాల్. తనకొచ్చే జీతంలో సగాన్ని వెచ్చించి రూ. 1 జనతా హోటల్ అనే పేరుతో సిలిగురిలో ఒక హోటల్ స్థాపించారు.
ఇక్కడున్న ప్రభుత్వ ఆఫీసులకు,ఆసుపత్రులకు,ప్రయాణికులకు కడుపునిండా భోజనం పెడుతున్నాడు. మరి ఆ ఒక్క రూపాయి ఎందుకు అంటే..నేను నడిపే బడిలో వారిని ఏదో రకంగా భాగస్వాములను చేయాలి కదా అంటాడు.
విద్యా ఛాయ పేరుతో సిలిగురిలో ఒక పాఠశాలను నడుపుతున్నారు శక్తి పాల్ గారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే పేద వలస కార్మికుల పిల్లల సంక్షేమమే లక్ష్యంగా నడిచే ఈ బడిలో " ఉచితంగా చదువు " చెప్పడమే కాదు, రెండు పూటలా భోజనం పెడుతున్నాడు,ఉచితంగా బట్టలు,పుస్తకాలు అందిస్తున్నాడు శక్తి పాల్.ఇందుకోసం తన సంపాదనలో సగానికి పైగా వెచ్చిస్తున్నారు శక్తి పాల్..
