6, ఆగస్టు 2026, గురువారం

పేద పిల్లలకు ఉచిత విమాన యానం

 ఆకాశ యానం అందరికీ అందదు. ఆ అందని ఆకాశ ప్రయాణాన్ని పేద పిల్లలకు ఉచితంగా అందించేందుకు ఉత్తరాఖండ్ లో ఉన్న హల్ద్వానీ నగరంలోని పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ లోని విమానం బయలుదేరి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగింది. ఆదివారం జరిగిన ఈ విమాన ప్రయాణం లో 30 మందికి పైగా నిరుపేద కుటుంబాల పిల్లలు ప్రయాణించారు. ఆ పిల్లల కోసం విమాన టికెట్లను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు వ్లాగర్ సౌరభ్ జోషి, ఆయన సతీమణి అవంతికా భట్ లు బుక్ చేశారు. ఆ పిల్లల తో పాటు వారూ ప్రయాణించారు. నోయిడా లోని గేమింగ్ జోన్ లో పిల్లలను ఆడిస్తూ రోజంతా సరదాగా గడిపారు. 

రెస్టారెంట్ లో పిల్లలకు ఇష్టమైన పిజ్జాలు, బర్గర్ లు ఆర్డర్ చేశారు. ఆ పిల్లల సందడి, అల్లరి, సంతోషాలను వీడియో తీసి సౌరభ్ తన యూట్యూబ్ ఛానల్ లో పోస్టు చేశాడు. అవంతిక తన ఇన్స్టా గ్రామ్ హ్యాండిల్ లో పోస్టు చేసింది. 

పేద పిల్లల సంతోషం కోసం ఒక రోజు చేసిన ఖర్చు కన్నా వారి సంతోషం కోసం శ్రద్ధ చూపినందుకు సోషల్ మీడియాలో ఎంతో మంది అవంతిక జోడీ ని ప్రశంసించారు. కొన్ని నెలల క్రితం అవంతిక, సౌరభ్ లు విడిపోతున్నారని, అందుకే వారిద్దరూ వీడియోల్లో కనిపించడం లేదని పుకార్లు వచ్చాయి. ఆ పుకార్లకు తాజాగా వారి వీడియోలు సమాధానం ఇస్తున్నాయి. పురాతన కాలంలో పావురాలతో సందేశం పంపినట్లు, ఈ జోడీ వీడియో తో నెటిజన్ లకు సందేశం పంపింది .

పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ .. ఉచిత శిక్షణలు

 తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ తెలిపింది.

ప్రస్తుతం  ఎస్ ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు " ఉచిత శిక్షణ తో పాటు వసతి సౌకర్యం" కల్పించాలని పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ నిర్ణయించింది. 300 మంది అభ్యర్థులకు ప్రత్యక్షంగా .. మరో 300 మందికి ఆన్ లైన్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. లయన్స్ క్లబ్ మరియు రాంకీ గ్రూప్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ ప్రొ. లక్ష్మీ కుమారి తెలిపారు. 

 సెప్టెంబర్ 15 నుంచి మొదలయ్యే శిక్షణ ఎస్ ఐ మెయిన్స్ పరీక్షలు ముగిసే వరకు కొనసాగుతుంది.

ఆసక్తి గల అభ్యర్థులు 95424 33427 ఫోన్ నెంబర్ లేదా https://paravasthucreativefoundation.net వెబ్ సైట్ ను సందర్శించాల్సిందిగా కోరారు. 

5, ఆగస్టు 2026, బుధవారం

యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి

 తెలంగాణ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు కామారెడ్డి జోన్ కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతలో ఉపాధి పొందడానికి కావలసిన వివిధ నైపుణ్యాలను పెంపొందించడానికి సంస్థ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ఇందుకోసం 45 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇతర సమగ్ర వివరాలకు 63000 57052 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. 

ఉచిత భోజనం@శ్రీ బాలాజీ ఫ్యామిలీ రెస్టారెంట్, సీలేరు

 ఇప్పుడిప్పుడే పట్టణంగా ఎదుగుతున్న ఏజెన్సీ ప్రాంతం.. సీలేరు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఈ ఊరిలో హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు తూర్పు గోదావరి జిల్లా నుండి వచ్చింది నక్కా జ్ఞానేశ్వర రావు గారి కుటుంబం. మొదట్లో వ్యవసాయం చేసిన ఆయన, తర్వాత శ్రీ బాలాజీ ఫ్యామిలీ రెసిడెన్సీ అండ్ రెస్టారెంట్ ను పెట్టాడు. అప్పుడే అక్కడికి గర్భిణులు ఎక్కువగా రావడం గమనించాడు. వారందరూ మారుమూలన ఉన్న పర్వత ప్రాంతాల నుంచి సీలేరు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వచ్చే గిరిజనులు. ఐతే వారి దగ్గర భోజనానికి సరిపడా డబ్బు ఉండేది కాదు. తమ దగ్గర ఉన్నదేదో చేతిలో పెట్టి వెళ్ళి పోయే వారు. ఆయన కూడా ఇంతే ఇవ్వాలి అని పట్టు పట్టేవారు కాదు. పోనుపోను వారిని డబ్బులు అడగడమే మానేశాడు జ్ఞానేశ్వర రావు. అలా 2018 నుండి వారికి ఉచితంగానే భోజనం పెడుతున్నాడు ఆయన. 

కేవలం తన హోటల్ ను వెతుక్కుంటూ వచ్చే వారికి మాత్రమే కాకుండా , సీలేరు పీ హెచ్ సీ లో పని చేసే నర్సులకు రోజూ తన హోటల్ మీల్స్ టోకెన్లు ఇస్తున్నాడు. వారు దవాఖానకు వచ్చే గర్భిణులకు , వారి సహాయకులకు ఈ టోకెన్లు ఇచ్చి హోటల్ కు పంపిస్తున్నారు. అలా రోజూ కనీసం 20 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నాడు శ్రీ జ్ఞానేశ్వర రావు. 

ఇక్కడ ప్రతి నెలా 9 వ తేదీన గర్భిణులకు అన్ని రకాల టెస్టులు చేస్తుంటారు. ఆ సమయంలో వంద మంది కి పైగా వస్తుంటారు. ఆ రోజున తన భార్య నాగమణితో కలిసి హోటల్ నుండి తానే స్వయంగా భోజనం తీసుకెళ్లి ఇస్తుంటాడు ఆయన. 

ఉచిత విద్య@విద్యాఛాయ పాఠశాల@ సిలిగురి

 పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి పట్టణానికి చెందిన శక్తిపాల్ ది నిరుపేద కుటుంబం. అన్నం దొరకడమే కష్టమైన పరిస్థితుల్లో బాల కార్మికుడిగా మారాడు ఆయన. తర్వాత ఎంతో శ్రమించి సైన్యంలో చేరాడు. ప్రస్తుతం అస్సాం రైఫిల్స్ లో హవల్దార్ గా పని చేస్తున్నారు శ్రీ శక్తిపాల్. తన చిన్నప్పటి ఆకలి బాధలను మరచిపోలేదు శక్తిపాల్. తనకొచ్చే జీతంలో సగాన్ని వెచ్చించి రూ. 1 జనతా హోటల్ అనే పేరుతో సిలిగురిలో ఒక హోటల్ స్థాపించారు. 

ఇక్కడున్న ప్రభుత్వ ఆఫీసులకు,ఆసుపత్రులకు,ప్రయాణికులకు కడుపునిండా భోజనం పెడుతున్నాడు. మరి ఆ ఒక్క రూపాయి ఎందుకు అంటే..నేను నడిపే బడిలో వారిని ఏదో రకంగా భాగస్వాములను చేయాలి కదా అంటాడు.

విద్యా ఛాయ పేరుతో సిలిగురిలో ఒక పాఠశాలను నడుపుతున్నారు శక్తి పాల్ గారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే పేద వలస కార్మికుల పిల్లల సంక్షేమమే లక్ష్యంగా నడిచే ఈ బడిలో " ఉచితంగా చదువు " చెప్పడమే కాదు, రెండు పూటలా భోజనం పెడుతున్నాడు,ఉచితంగా బట్టలు,పుస్తకాలు అందిస్తున్నాడు శక్తి పాల్.ఇందుకోసం తన సంపాదనలో సగానికి పైగా వెచ్చిస్తున్నారు శక్తి పాల్..


బాలికలకు ఉచిత పైలట్ శిక్షణ

 తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు ఉచితంగా పైలట్ శిక్షణ ఇచ్చేందుకు ఇండిగో సంస్థ సీ ఎస్ ఆర్ విభాగం ఇండిగో రీచ్, ఇంటర్ విద్యా శాఖ ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఇంటర్ విద్యా శాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్, భారత్ కేర్స్ ట్రస్ట్ ప్రతినిధి సి. సాయి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఇండిగో రీచ్, భారత్ కేర్స్ సంస్థ లతో కలిసి అమలు చేస్తున్న " గివింగ్ వింగ్స్ టు ఫ్లై కార్యక్రమం " ద్వారా పైలట్ శిక్షణ ఇస్తారు. 20 నెలల పాటు కొనసాగే శిక్షణా కాలంలో కమర్షియల్ పైలట్ లైసెన్స్, ట్రైనింగ్ విత్ ఏ టీ ఆర్ టైప్ రేటింగ్, బస, భోజన వసతి, వైద్య బీమా, మెంటార్ షిప్, కెరీర్ మార్గదర్శక ఖర్చులను పూర్తిగా ఆయా సంస్థలే భరిస్తాయి. 

ఈ ఒప్పందంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అమ్మాయిలు తమ పైలట్ కావాలన్న కలను నిజం చేసుకోవచ్చని అభిలాష అభినవ్ అన్నారు.కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, వెబినార్లు నిర్వహిస్తారని తెలిపారు. అర్హులైన విద్యార్థినులు అధికారిక పోర్టల్ indigoreachgwf.scholarsbox.in ద్వారా దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఇంటర్ కళాశాలల నెట్వర్క్ ద్వారా ఈ సమాచారాన్ని విద్యార్థినులకు చేరువ చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

4, ఆగస్టు 2026, మంగళవారం

ఉచిత అన్న ప్రసాదం@ కడప కలెక్టరేట్

 అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసులలో జరిగినట్లుగానే కడప కలెక్టరేట్ లో కూడా ప్రతి సోమ వారం గ్రీవెన్స్ డే జరుగుతుంది. చుట్టు పక్కల ఊర్ల నుండి వందలాది మంది ప్రజలు వినతి పత్రాలు తీసుకుని వస్తుంటారు. పెన్షన్ దరఖాస్తుల కోసం, ఇతర సహాయాల కోసం, అర్జీలు పెట్టుకుని అధికారుల వంక ఆశగా చూస్తుంటారు. అందుకే దానిని అధికారికంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని పిలుస్తుంటారు. అక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో తెలియదు కానీ వచ్చిన వారి ఆకలి మాత్రం తీరుతుంది. అలా అర్జీలు పట్టుకుని అక్కడికి వచ్చే వారందరికీ కడుపు నిండా భోజనం పెడుతున్నారు శ్రీ సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు. గత 12 సంవత్సరాల నుంచి ఒక యజ్ఞం లా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు ఈ ఉచిత అన్నదానాన్ని శ్రీ సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు. రాయల సీమ లో తొలి ప్రైవేటు న్యాయ కళాశాలను స్థాపించిన వ్యక్తి ఆయన. 

1986 లో నాటి ముఖ్య మంత్రి శ్రీ ఎన్టీరామారావు గారి మీద అభిమానంతో బసవరామ తారకం న్యాయ కళాశాల అని పేరు పెట్టారు ఆయన. 2015 లో గోవర్ధన్ రెడ్డి గారు కడప కలెక్టరేట్ కు పని మీద వచ్చినప్పుడు , అర్జీలు పట్టుకుని మధ్యాహ్నం వరకు అధికారుల కోసం పడిగాపులు కాస్తూ ఆకలితో అలమటిస్తున్న ప్రజలను చూసారట ఆయన. ఈ దుస్థితిని తొలగించాలని నాటి నుంచి ఈ అన్న యజ్ఞాన్ని ప్రారంభించారు. దీని కోసం నెలకు దాదాపు 50 వేల రూపాయలు వరకు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

పోలీసు అధికారిగా పనిచేసిన తన తండ్రి ,తల్లితో కలిసి ప్రతి రోజూ కొంత మంది పేదవారికి   ఇంటి వద్ద అన్నం పెట్టేవారని , నేను దానిని కొనసాగిస్తున్నాను, అంతే అంటారు వినమ్రంగా శ్రీ సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు. 

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...