9, ఆగస్టు 2026, ఆదివారం

ఉచిత మధుమేహ చికిత్స@ డా. మోహన్స్ డైరెక్ట్

 మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు మాత్రమే పెరుగుతాయి.. అనుకుంటాము కానీ కాళ్లకు పుండ్లు , కంటి సమస్యలు ,మూత్రపిండాల సమస్యలు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఎదురవుతుంటాయి. అవగాహన ఉన్న వ్యక్తులు అయితే వాటన్నింటినీ గమనించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటారు. మరి పేదవాళ్లు, అవగాహన లేని వారు.. మధుమేహం గురించి సరిగా తెలియక, ఖరీదైన వైద్యం చేయించుకోలేక మరెన్నో సమస్యల బారిన పడుతుంటారు. అలాంటి వారికి ఉచిత మధుమేహ వైద్యాన్ని అందించేందుకు డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్ వారు " డైరెక్ట్" ను ప్రారంభించారు. 

షుగర్ రోగులు ఎక్కువగా వెళ్ళే ఆసుపత్రులలో డాక్టర్ మోహన్స్ ఆసుపత్రి ఒకటి. భారతదేశవ్యాప్తంగా 50 కి పైగా శాఖలు ఉన్న ఈ సెంటర్ కు వచ్చే రోగులలో పేదలూ ఉంటారు .అయితే వారు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే ఇక్కడ జీవితాంతం ఉచితంగా చికిత్స చేయించుకునే వీలు ఉంది. ఒకవేళ షుగర్ వ్యాధి ముదిరి కంటి ఆపరేషన్ తప్పనిసరి అయినా, ఫుట్ అల్సర్ కారణంగా పాదాలకు ఆపరేషన్ చేయాల్సి వచ్చినా అది కూడా ఫ్రీగానే నిర్వహిస్తారు ఇక్కడ. ఆరోగ్యం పైన కాస్త అవగాహన ఉన్నవారు లేదా మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారితో పోలిస్తే.. రోజు కూలీలు, పేదలు, గ్రామాల్లో ఉండే వారికి మధుమేహం గురించి పెద్దగా తెలియదు. ఒకవేళ ఆ లక్షణాలు కనిపించినా వైద్యం కోసం ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది కనుక నిర్లక్ష్యంగా ఉంటుంటారు, అలాంటివారికి మధుమేహ చికిత్సను ఉచితంగా అందించేందుకు" డాక్టర్ మోహన్స్"  2006 లో "డైరెక్ట్"  డయాబెటిస్ ఇంటర్నేషనల్ రీసర్చ్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించింది. మధుమేహం గురించి అవగాహన కల్పిస్తూనే పరీక్షలు చేయడం, చికిత్స అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు, కౌన్సిలింగ్ ఇలా అన్ని రకాల సేవలను ఆ రోగులకు జీవితాంతం అందిస్తుంది ఈ డైరెక్ట్.

మధుమేహం రెండు రకాలుగా ఉంటుంది. కొందరికి జన్మతః వస్తుంది. దానిని టైప్ వన్ డయాబెటిస్ అంటారు. మరొకటి టైప్ టు డయాబెటిస్ ..ఇది ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, వేళకు నిద్రపోకపోవడం, ఒత్తిడి తదితర కారణాలతో మొదలవుతుంది .రెండింటిలో టైప్ వన్ మధుమేహం చికిత్స కాస్త ఖర్చుతో కూడుకుంది. వారు జీవితాంతం ఇన్సులిన్ తీసుకుంటూ, నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. అదే టైప్ టు ని తీసుకుంటే వైద్యులు సూచించిన మందులు వాడుతూ, జీవనశైలిలో మార్పులు చేసుకుని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే ఈ రెండింటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కళ్ళతో పాటు మూత్రపిండాల పైన కూడా ప్రభావం పడుతుంది. కాళ్లకు దెబ్బ తగిలి చిన్న గాయమైనా పుండుగా మారి ఒక పట్టాన తగ్గక ఆపరేషన్ వరకు వెళ్లాల్సి రావచ్చు. పేదలకు, పల్లె ప్రజలకు ఇవన్నీ పెద్దగా తెలియవు కనుక" డైరెక్ట్ " మధుమేహం గురించి తెలియజేస్తూనే వారికి ఉచిత పరీక్షలను నిర్వహిస్తుంది. సమస్య ఉందని తేలితే మందులను లేదా ఇన్సులిన్ కిట్ ను అందిస్తుంది. షుగర్ లెవెల్స్ ను అంచనా వేసే గ్లూకోజ్ సెల్ఫ్ మానిటరింగ్ మిషన్ తో పాటు అవసరమైన వారికి ఇన్సులిన్ పంప్స్ ను ఇస్తారు. ఇప్పటివరకు తమిళనాడులోని కాంచీపురం లో ఐదు గ్రామాలు ,చూనంపేట్ చుట్టుపక్కల 14 గ్రామాలు కలిపి దాదాపు 15 వేల మంది మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఉచిత చికిత్సను అందించే ప్రయత్నం చేస్తోంది" డైరెక్ట్" . 

అదే సమయంలో టైప్ వన్ డయాబెటిస్ బారిన పడిన 600 మందికి పైగా బాల నేరస్తులకు ఉచిత ఇన్సులిన్ కిట్స్ పంపిణీ చేసింది. హైదరాబాదులోనూ టైప్ వన్ బాధితులను గుర్తించి ఇన్సులిన్ అందిస్తోంది .వీటితో పాటు  చికిత్స విషయంలో సందేహాలు ఉన్నవారు తరచు ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండా మొబైల్ టెలి మెడిసిన్ సేవలను ప్రారంభించింది. అంటే" డైరెక్ట్"  సిబ్బంది రోగులకు నిత్యం అందుబాటులో ఉంటారు. అదే సమయంలో ఆ నిర్వాహకులు స్థానిక స్వయం సహాయక బృందాలలోని మహిళలను, యువతను వాలంటీర్లుగా మార్చి వారి ద్వారా మధుమేహ బాధితులు తీసుకోవలసిన పోషకాహారం ,జీవన విధానంలో చేసుకోవలసిన మార్పుల పైన అవగాహన కల్పించేలా ప్రోత్సహిస్తున్నారు.

 మధుమేహానికి ఆర్థిక పరిస్థితులు అడ్డు రాకూడదన్న ఆలోచనతోనే డైరెక్ట్ ను ప్రారంభించాము, మధుమేహం కారణంగా కళ్ళూ లేదా పాదాలకు ఆపరేషన్లను ఆసుపత్రుల్లోనే ఉచితంగా చేస్తూ, వారు పూర్తిగా కోలుకునే వరకు మేము పర్యవేక్షిస్తాం అనే డాక్టర్ వి మోహన్ ఇందుకోసం డయాబెటాలజిస్టులు, నర్సులు, డైటీషియన్లు, టెక్నీషియన్లు, సర్జన్లు, కౌన్సిలర్లతో కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇక పేదల ఆరోగ్య పరిస్థితి, కుటుంబ వివరాలు, నెలసరి ఆదాయం వంటివన్నీ అంచనా వేశాకే ఉచిత చికిత్సను అందించే " డైరెక్ట్ "  టెలీ మెడిసిన్ తో పాటు తమిళనాడులోని డాక్టర్ మోహన్స్ ఆసుపత్రి లో "ఎం విశ్వనాథన్ ఫ్రీ డయాబెటిస్ క్లినిక్ " అనే పేరుతో ఒక క్లినిక్ ను ప్రారంభించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థతో కలిసి ఈ సేవలను అందిస్తున్న" డైరెక్ట్"  కర్ణాటక, కేరళ, ఒడిశా ,పుదుచ్చేరి.. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలో ఉచిత వైద్యాన్ని అందిస్తోంది. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...