4, ఆగస్టు 2026, మంగళవారం

విద్యార్థినులకు ఉచిత ఆటో ప్రయాణం

 ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు ఉచిత ప్రయాణం అని రాసి ఉన్న గులాబీ రంగు ఆటో చెన్నై లో అందరినీ ఆకర్షిస్తుంటుంది. చెన్నై లోని టీ నగర్, కోడంబాక్కం, అన్నా నగర్, పెరంబూర్ ప్రాంతాలలో గత కొన్ని సంవత్సరాలుగా తన ఆటోలో ఉచితంగా అమ్మాయిలను తీసుకు వెళుతోంది " రాజీ అశోక్" 




54 ఏళ్ల రాజీ అశోక్ ఆర్థిక సమస్యల కారణంగా కాలేజీ చదువును అర్ధాంతరంగా మానివేసింది. తన చదువు కొనసాగి ఉంటే జీవితం బాగుండేదని అనుకుంటూ ఉంటుంది. తనలాగే ఇతరులు చదువు మధ్యలో మానేయకుండా ఉండాలని తన వంతు సహాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రాజీ అశోక్. 

ప్రతి రోజూ విద్యార్థినులను బడిలో దింపి సాయంత్రం తిరిగి తీసుకు వస్తుంది రాజీ. రోజూ 10 నుంచి 15 మంది బాలికలకు సహాయం చేస్తుంది. ఇలా చేయడం అంటే తన సంపాదనలో ఎంతో కొంత వదులుకోవడమే. ఐతే అదేమీ తనకు ఇబ్బందిగా లేదు. స్కూల్, బస్ స్టాప్, ఆటో స్టాండ్ దగ్గర పిల్లల కోసం వేచి చూస్తాను. గులాబీ రంగు ఆటో ను గుర్తు పట్టి వెంటనే ఎక్కేసారు. నన్ను చూడగానే వారికి సంతోషంగా ఉంటుంది. సౌకర్యంగా కూర్చుంటారు. ఆకలి వేస్తే తినడానికి ఆటోలో బిస్కట్ ప్యాకెట్లు ఎప్పుడూ ఉంటాయి అంటుంది రాజీ అశోక్. 


ఎప్పుడో ఎక్కిన పిల్లలు సంతోషంగా పలకరించడం,వారి  తల్లిదండ్రులు ఆప్యాయంగా పలకరిస్తుంటే వెయ్యి ఏనుగుల బలం వస్తుంది, అంతులేని ఉత్సాహం వస్తుంది, ఇంకా ఏదైనా చేయాలని అనిపిస్తుంది అంటుంది రాజీ.

నేను రాజీ అక్క ఆటోలో ప్రయాణించాను అని ఎంతో మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు, వాటికి ప్రశంసలూ వస్తుంటాయి.. అవి నాకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంటాయి అన్నారు రాజీ.. 

వయసు 54 ఏళ్ళు కావడంతో స్వస్థలానికి తిరిగి వెళ్ళాలనిపించి ఇంటికి వెళ్ళిపోయారు రాజీ.మనసు మాత్రం చెన్నై ని వదలలేదు.. మళ్ళీ చెన్నై వచ్చేశారు. రాజీ భర్త ఒక సంస్థ ఇచ్చిన అంబులెన్స్ తో కేరళలో ఉచితంగా సేవ చేస్తుండడం, రాజీ కూడా చెన్నైలో తన వంతు సేవ చేస్తుండడం మనసుకేంతో ఆనందంగా ఉందంటారు రాజీ. చిన్న పాటి ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతుంటారు రాజీ. ఒక పెద్ద ఆటో ఉంటే మరింత మంది కి సేవ చేయగలుగుతాను అంటారు రాజీ. 


3, ఆగస్టు 2026, సోమవారం

జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ లో ఉచిత విద్య

 అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో వంద శాతం ఉచిత విద్య అందించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వంచరెడ్డి శ్రీకాంత్, వ్యాగ్మారే సుభాష్ లు కోరారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ ను కలిసి వినతి పత్రం అందచేశారు. జిల్లా సందర్శనకు వచ్చిన విద్యా శాఖ కార్యదర్శి శ్రీమతి యోగితా రాణా గారిని ప్రెస్ క్లబ్ కార్యవర్గం కలిసి ఉచిత విద్య అందించాలని వినతి పత్రం అందచేశారు. ప్రైవేట్ , కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్య కోసం తగు చర్యలు తీసుకోవాలని ఆమె డీఈఓ గారికి ఆదేశాలు జారీ చేశారు. డీఈఓ గారు స్పందిస్తూ ఇతర జిల్లాల్లో ని ప్రొసీడింగ్స్ పరిశీలించి నిజామాబాద్ జిల్లాలో కూడా ఉచిత విద్య అందించేలా త్వరలో చర్యలు చేపడతామని తెలిపారు. 

అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ లలో ఉచిత ప్రవేశం

 దేశంలో వృత్తిపరమైన శిక్షణ లో నాణ్యతను, ప్రయోజనాలను విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ ఫర్మేషన్ త్రూ ఐ టీ ఐ స్.. పీఎం సేతు పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ పథకానికి సంబంధించి సంగారెడ్డి క్లస్టర్ లో ఎల్లారెడ్డి ఏ టీ సీ ను ఎంపిక చేశారు. దీని ద్వారా ఈ కేంద్రంలో అత్యాధునిక యంత్రాలు, ఆటోమేషన్ పరికరాలు , డిజిటల్ ల్యాబ్ లు, ఆధునిక కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు అనుగుణంగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ దేశ వ్యాప్తంగా 1000 ఏ టీ సీ లను ఆధునీకరించనున్నది.

సంగారెడ్డి క్లస్టర్ లో ఎల్లారెడ్డి తో పాటు మెదక్, దుబ్బాక, హత్నూర్ ఏ టీ సీ లు ఉన్నాయి. వీటిని స్పోక్ ఏ టీ సీ లు గా అప్ గ్రేడ్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం, న్యూ ల్యాండ్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళుతోంది.

ఉచిత ప్రవేశం..

విద్యార్థులు ఈ కోర్సుల లో ప్రవేశం పొందేందుకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. శిక్షణా కాలంలో ప్రభుత్వం రూ.2 వేల చొప్పున స్టైఫండ్ లేదా స్కాలర్ షిప్ ఇస్తుంది. కోర్స్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి క్యాంపస్ సెలెక్షన్ ద్వారా పలు కార్పొరేట్ సంస్థల లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వంద శాతం ప్లేస్ మెంట్ సహాయం లభిస్తుందని భావిస్తున్నారు. ఆసక్తి గల వారు టీ జి ఐ టీ ఐ అడ్మిషన్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు హైద్రాబాద్ వంటి నగరాలకు వెళ్ళనవసరం లేకుండా సొంత జిల్లాలోనే ప్రపంచ స్థాయి నైపుణ్యాలను ఈ స్పోక్ ఏ టీ సీ ద్వారా ఉచితంగా పొంది మంచి ఉద్యోగాలు సాధించడానికి అవకాశాలు మెరుగవుతాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రతి సోమ, గురు వారాల్లో ఉచిత ఫిజియోథెరపీ

 దివ్యాంగులు ఉచిత ఫిజియోథెరపీ ని సద్వినియోగం చేసుకోవాలని బాల్కొండ మండలం విద్యాధికారి బట్టు రాజేశ్వర్ అన్నారు. తెలంగాణలోని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడిచే భవిత కేంద్రాలలో ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రతి సోమ, గురు వారాల్లో ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవిత కేంద్రాల్లో నిపుణులైన ఫిజియోథెరపీ వైద్యులచే ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. పిల్లలకు అవసరమైన వ్యాయామాలు నేర్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

దివ్యాంగులకు విద్యాభ్యాసంతో పాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఐ ఈ ఆర్ పీ లను నియమించినట్లు ఆయన తెలిపారు. దివ్యాంగులతో పాటు వారి వెంట వచ్చే మరొకరికి ప్రభుత్వం రవాణా ఖర్చులను సైతం చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రభుత్వం అవసరమైన,ఉపయోగకరమైన పరికరాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 

దోమకొండ గడికోట ట్రస్ట్ వారి ఉచిత సేవలు

 దోమకొండ గ్రామంలో బీడీ కార్మికులు, కూలీలు ఎక్కువగా ఉండడంతో వారి కుటుంబాలలో మెరుగైన ఆర్థిక పరిస్థితులు లేవు. అనారోగ్యంతో బాధ పడుతున్న వారిని వైద్యులకు చూపించలేని పరిస్థితిలో పలు కుటుంబాలు ఉండేవి. ఈ నేపథ్యంలో నిరుపేదలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో దోమకొండ గడికోట ట్రస్ట్, గ్రామ అభివృద్ధి సంస్థ కలిసి ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాయి. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనిమిదేళ్లుగా ఈ ఉచిత వైద్య సేవలు నిరంతరాయంగా అందుతున్నాయి. 

ట్రస్ట్ ఆధ్వర్యంలో 2017 లో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. అధిక సంఖ్యలో బాధితులు శిబిరానికి వచ్చారు. చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులతో పాటు బీపీ, షుగర్ వంటి వాటితో బాధ పడుతూ వైద్య పరీక్షలకు వెళ్లలేని దుస్థితిని ట్రస్ట్ ప్రతినిధులు గ్రహించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులను సర్వే నిర్వహించి గుర్తించారు. నిరుపేదలైన రోగులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, మందులు అందించాలని ట్రస్ట్ వారు సేవలందించడానికి  పూనుకున్నారు. 

జూలై 18,2018 నుంచి ప్రతి నెలా రోగులకు వైద్యులచే పరీక్షలు చేయిస్తూ, మందులను అందిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా ఈ సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. డయాబెటిస్ తో బాధ పడుతున్న ముగ్గురు విద్యార్థులకు సైతం ప్రతి నెలా సరిపోవు ఇంజక్షన్లు, మందులను అందిస్తూ వారి చదువులకు ఊతమిస్తున్నారు. 

అపోలో ఆసుపత్రి వారి సహకారంతో ఈ ఉచిత వైద్య సేవలు అందించడం , నిరుపేద కుటుంబాల్లో ఆత్మీయత,సంతోషం నెలకొనడం ఎంతో తృప్తిని ఇస్తుందని దోమకొండ గడికోట ట్రస్ట్ సీనియర్ మేనేజర్ బాబ్జీ గారు పేర్కొన్నారు.

125 రోజుల ఉచిత శిక్షణ / ఫౌండేషన్ కోర్స్

 తెలంగాణ రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిల్ ల ద్వారా  వివిధ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 125 రోజులపాటు ఇచ్చే ఉచిత కోచింగ్ కు  అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ ,ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల అభ్యర్థులు/ఈ బీ సీ,అనాధ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. గ్రూప్ వన్ ,గ్రూప్ టు, గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్ లతోపాటు పోలీస్ నియామక పరీక్షలు, బ్యాంకింగ్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్లు సమర్పించాలి. 

ఈ ఉచిత శిక్షణ కు ఎంపికైన వారి జాబితాను వారి డిగ్రీ మార్కుల ఆధారంగా ఆగస్టు 18 వ తేదీన విడుదల చేస్తారు. ధృవ పత్రాల పరిశీలన చేస్తారు. ఆగస్టు 25 వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.

అభ్యర్థి డిగ్రీ పాస్ అయి ఉండాలి,కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయలకు మించ రాదు. ప్రతి నెలా 75 శాతం ,అంతకంటే ఎక్కువ హాజరు ఉన్న అభ్యర్థులకు 5 నెలల పాటు నెలకు 1000 రూపాయలు పుస్తక నిధిగా రవాణా భత్యంతో కలిపి స్టయిఫండ్ గా చెల్లింపబడుతుంది.

రెగ్యులర్ కోర్సులు చదువుతున్న వారు, ఉద్యోగం చేస్తున్నవారు, గతంలో బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత కోచింగ్ పొందినవారు ఈ ఉచిత శిక్షణ కు అనర్హులు. 

అర్హులైన అభ్యర్థులు..

 www.tgbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు నెట్ ఫ్లిక్స్ ప్లాన్ ఉచితం

 ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మరియు ఓటీపీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తమ కస్టమర్ల కోసం జత కట్టాయి. ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులు ప్రతి నెలా 299 అంత కంటే ఎక్కువ విలువైన 4 ఆర్డర్ లను పూర్తి చేయడం ద్వారా నెట్ ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ను ఉచితంగా పొందవచ్చు. ఈ భాగస్వామ్యం ఫ్లిప్ కార్ట్, ఫ్లిప్ కార్ట్ గ్రోసరీ, ఫ్లిప్ కార్ట్ మినిట్స్ లో చేసే రోజు వారీ షాపింగ్ కు రివార్డ్ పాయింట్స్ అందిస్తుంది. దేశ ఈ కామర్స్ చరిత్ర లోనే మొదటి సారిగా ప్రపంచంలోనే టాప్ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ను రోజు వారీ షాపింగ్ ద్వారా పొందవచ్చు. ఈ ప్రయోజనం ఆగస్టు 1 నుండి అమలు లోకి వస్తుంది. ఫ్లిప్ కార్ట్ సభ్యులు ఒక క్యాలండర్ నెల లోపు 299 అంత కంటే ఎక్కువ విలువ ఉన్న 4 ఆర్డర్ లను పూర్తి చేయాల్సి ఉంటుంది. అర్హత కలిగిన 4 ఆర్డర్ లు పూర్తి అయిన తర్వాత నెట్ ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ను 30 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ యాప్ ద్వారానే ఈ ప్రయోజనాన్ని యాక్టివేట్ చేస్తారు. ప్రత్యేక లాగ్ ఇన్ అవసరం లేదు. 30 రోజుల తర్వాత ఈ ప్రయోజనం రీసెట్ అవుతుంది. ఇదే షాపింగ్ పద్ధతి ద్వారా దీన్ని మళ్ళీ పొందవచ్చు. 

ఫ్లిప్ కార్ట్ సభ్యులు కాని కస్టమర్ లు 12 నెలల లోపు 15 ఆర్డర్ లను పూర్తి చేసిన తర్వాత వెనువెంటనే అదనపు ప్రయోజనానికి ఆటోమేటిక్ గా అర్హత పొందుతారు. 

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...